(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించేందుకు ఆదివారం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి వచ్చారు. తొలుత సంఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహార్లాల్, ఎస్పీ బి. రాజకుమారి, దేవాదాయశాఖ కమిషనర్, అధికారులతోను, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అక్కడి పరిస్థితులు గురించి ఆరా తీసి అర్చకులతో మాట్లాడారు. రాములవారి విగ్రహం శిరస్సు లభించిన కోనేటిని పరిశీలించారు.. కోదండరాముని విగ్రహం ధ్వంసం చేసిన పరిస్థితులు, అక్కడి భధ్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం స్థానిక దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహం పునః ప్రతిష్ఠకు, ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బురద జల్లే ప్రయత్నం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలను అడ్డగోలుగా కూల్చారని ఆరోపించారు. చంద్రబాబు రామతీర్థం వచ్చి నీతి కబుర్లు చెబుతున్నారని, ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. ఇదంతా ఓర్వలేక రాజకీయ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రిపై బురద జల్లే ప్రయత్నమే అన్నారు. చంద్రబాబు మొన్నటిదాకా కులాలు, మతాలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేసారని, అది కాక ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు దేవుడు అంటే నమ్మకం ఉందా? హిందూ సంప్రదాయాలను పట్టించుకునే అలవాటు ఉందా? సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు.
చాలా బాధాకరం
రామతీర్థంలో జరిగిన ఘటన బాధాకరమని, ప్రతి ఒక్కరి మనసు గాయపరిచిందని మంత్రి వెల్లంపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహ పునః ప్రతిష్ఠకు, ఆలయ అభివృద్ధికి ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టాల్సిన చర్యలు గురించి అర్చకులతోను, అధికారులతోను, స్థానిక ప్రజాప్రతినిధులతోను మాట్లాడినట్లు తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారు ఎంతటివారైనా తొందరలోనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామతీర్థం అనేది ప్రత్యేక పుణ్యక్షేత్రమని, దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరిగినప్పుడు సంయమనం పాటించాలని, అందుకు హిందూ బంధువులు అందరూ సహకరించాలని కోరారు.
నారా లోకేష్ ఎందుకూ పనికి రాడు : బొత్స
“నారా లోకేష్ ఓ లోఫర్ .. ఆయన మీద నాకు ఉన్న కొద్దో, గొప్పో గౌరవం పోయింది.. నారా లోకేష్ ఎందుకూ పనికి రాడు .. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న వ్యక్తిని నోటికి వచ్చిన మాటలు మాట్లాడిన నారా లోకేష్కు కనీసం సంస్కారం అనే పదానికి కూడా అర్థం కూడా తెలియదు..” అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాములవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేయడానికి తక్షణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇష్టానుసారంగా మాట్లాడటమా ..?
ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు నారా లోకేష్కు ఎవరిచ్చారని బొత్స ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం పేరుతో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడటమేనా వాక్ స్వాతంత్య్రం అంటే అని నిలదీశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ..
రాష్ట్ర ప్రజలు తమకు ఏకపక్షంగా అధికారాన్ని ఇచ్చారని, ప్రజా తీర్పునకు లోబడి, ప్రజాస్వామ్య బద్ధంగా తాము పరిపాలన సాగిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. శాంతిభద్రతలను కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఒక వంక మత సామరస్యాన్ని కాపాడుకుంటూ.. మరోవంక ప్రజల అవసరాలను తీరుస్తూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని బొత్స అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ పరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.
అలజడులను సృష్టించేందుకే ..
చంద్రబాబు లాంటి మోసగాళ్లు, వెన్నుపోటుదారులు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్ర పన్నారని మంత్రి బొత్స విమర్శించారు. అందుకే దేవతా మూర్తుల విగ్రహాలపై దాడి చేయడమనే ఆకృత్యాలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read: అదితి గజపతిరాజుపై కేసు నమోదు