మంచి ఆశయంతో రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వైసీపీ సర్కార్ రాకతో కష్టాలు మొదలయ్యాయి. అభివృద్ధి వికేంద్రికరణ పేరిట వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్, జ్యూడిషియల్ రాజధానిగా కర్నూలును చేస్తూ ఏపీ ప్రభుత్వం జీఓని విడుదల చేసింది. భూములు ఇచ్చిన మా సంగతేంటని ప్రశ్నిస్తున్న రైతులు 250 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అమరావతి వల్ల లాభపడ్డారని వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఇదే సమయంలో ఈ ప్రాంతంలోని భూములను పేదలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండకూడదని సరికొత్త రాగాన్ని ఆలపించారు. తాజాగా సీఎం జగన్ ను కలిసి అమరావతి ప్రాంత వాసులు దురుద్దేశంతో ఉన్నారని అక్కడ రాజధానిని కొనసాగించరాదని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ కూడా అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుందామని చెప్పారని మంత్రి నాని తెలిపారు. అమరావతి నుంచి శాసన రాజధానిని కూడా తరలించాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందని విపక్షాలు విమర్శలు చేశాయి.
తాజాగా టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా మంత్రి కొడాలి నానితో గొంతు కలిపారు. టీడీపీతో కలిసి అమరావతి జేఏసీ చేస్తున్న దీక్షలతో గుంటూరు, కృష్ణ జిల్లా ప్రజలు కూడా 29 గ్రామాల ప్రజలకు వ్యతిరేఖమయ్యారని వంశీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పెద్ద మనసుతో పేద ప్రజలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని తీసుకున్న నిర్ణయానికి అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో 29 గ్రామాలతో బాటు గన్నవరం, గుడివాడ, విజయవాడ ప్రాంతాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తమకు కూడా 29 గ్రామాలలో ప్రవేశించే అర్హత లేదా? అని ప్రశ్నించారు. 29 గ్రామాల ప్రజలు కోర్ క్యాపిటల్ లో అడుగు పెట్టేందుకు వీలు లేదని కోర్టుకెళ్ళడం తప్పని హితవు పలికారు.
పేదలకు భూములు ఇస్తే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులతో కలిసి అమరావతి జేఏసీ కోర్టుకెళ్లిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లో కూడా పెద్ద భవంతుల పక్కన పేదల ఇళ్లులు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీకి మద్దతు తెలుపుతూ సీఎం జగన్ ను బూతులు తిడుతున్న జేఏసీ తీరు ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రశ్నించారు. గుంటూరు, కృష్ణ జిల్లా వారికి కూడా జేఏసీ తీరుపై అసహ్యం వేసిందని మంత్రి నాని, ఎమ్మెల్యే వంశీ చెప్పడంపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అమరావతి నుంచి శాసన రాజధానిని కూడా తరలించే ఉద్దేశంతోనే వైసీపీ ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద చూస్తే శాసన రాజధాని విషయంలో ఏదో జరుగుతుందని చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.