గతంలో చాలా మంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ నిర్మాతలు గా మారారు. అందులో కొందరు లాభాలు గడించారు. మరికొందరు భారీ నష్టాల్ని చవిచూశారు. వాటిని భర్తీ చేయలేక ఇండస్ట్రీనే వదిలేశారు. అయితే ఇప్పటి దర్శకులు చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటుకోని విధంగా.. లాభాల్లో వాటా అనే కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనికి ఆద్యుడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన తీసే ప్రతీ సినిమా లాభాల్లోనూ కొంత శాతం ఆయనకు వెళుతుంది. పారితోషికం వేరే ఉంటుంది. ఈ పద్ధతినే ఇప్పుడు టాలీవుడ్ లోని మిగిలిన స్టార్ డైరెక్టర్స్ అందరూ అనుసరిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ త్రివిక్రమ్ తోనే తరచుగా సినిమాలు తీస్తూ ఉంటుంది. ఈ బ్యానర్ మీద చాలా సినిమాలు తెరకెక్కాయి. అయితే నిర్మాతల్లో త్రివిక్రమ్ పేరు ఉండదు కానీ.. ఆయన తీసే ప్రతీ సినిమాకీ వాటా దక్కుతుంది. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కూడా మైత్రీ బ్యానర్ పై ‘రంగస్థలం’ తీసినప్పటినుంచి.. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు. ఇకపై మైత్రీ అతడితో తీయబోయే సినిమాలకూ వాటా దక్కనుంది. అలాగే .. కొరటాల శివ కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాడు. ఇప్పుడు వీరి లిస్ట్ లోకి కొత్తగా సురేంద్రరెడ్డి కూడా వచ్చి చేరాడు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మెప్పించలేకపోయినా.. టాలీవుడ్ వరకూ ప్రేక్షకుల్ని బాగానే అలరించింది. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో సూరి స్థాయి మరింత పెరిగింది. అందుకే ఎప్పుడూ పారితోషికం మాత్రమే అందుకొనే సురేంద్రరెడ్డి .. అఖిల్ 5 కోసం లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని టాక్. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఐదో సినిమా రీసెంట్ గా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే పోస్టర్ మీద ‘సరెండర్ 2 సినిమా ’ అనే బ్యానర్ పేరు కూడా కనిపిస్తుంది. ఇది సురేంద్ర రెడ్డి సొంత సంస్థే.
ఇంగ్లీష్ లో సురేందర్ స్పెల్లింగ్ తో తన పేరు కూడా సింక్ అయ్యేలా సరెండర్ అనే సౌండింగ్ వచ్చేలా బ్యానర్ పేరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ లోకి వెళ్ళి చూస్తే అఖిల్ సినిమాకోసమే ప్రత్యేకంగా బ్యానర్ స్థాపించినట్టు అర్ధమవుతుంది. అసలు అఖిల్ సినిమాకి సురేంద్రరెడ్డి దర్శకత్వం అనగానే.. అదెలా సాధ్యమయిందని ఆశ్చర్యపోయారు జనం. అయితే సూరి లాభాల్లో వాటాలు అనే కాన్సెప్ట్ ఓకే అయ్యాకనే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాడని తెలుస్తోంది. భారీ స్థాయిలో సూరి మార్క్ తో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మరి ఇంత వరకూ హిట్టు మొహమెరుగని అక్కినేని వారసుడికి సూరి ఏ రేంజ్ హిట్టిస్తాడో చూడాలి.