విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శ*వ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన వైసీపీ కుట్ర విశాఖ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుల పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత మెల్లిగా వైజాగ్ వచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..కేవలం కూటమిపై బురదజల్లే రాజకీయాలకు పరిమితమయ్యారు.
ప్రమాద తీవ్రతను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా KGH హాస్పిటల్ చేరుకున్నారు. పుట్టెడు బాధల్లో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తుండగా, వైసీపీ అనుబంధ సంఘాలు, కొన్ని లెఫ్ట్ పార్టీల లీడర్లు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నించారు. బాధితుల ఆక్రందనలను, వారి బాధను పక్కనబెట్టి, శ*వాలపై పేలాలు ఏరుకునే చందంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో లోకేష్ను అడ్డుకోవాలని చూశారు.
కానీ, అక్కడ ఉన్నది పాత లోకేష్ కాదు.. ప్రజా సమస్యలపై పోరాడి గెలిచిన నాయకుడు. యూనియన్ల ముసుగులో వచ్చిన వైసిపి నేతల కళ్లల్లోకి చూస్తూ నారా లోకేష్ నిలదీసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. నేను ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. నా కళ్ల ముందు సర్వస్వం కోల్పోయి ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వారితో నన్ను మాట్లాడనిస్తారా లేదా..? మీరు కేవలం గొడవ చేయడానికే వస్తే నేను దండం పెడతాను..కానీ, ఈ బాధితులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనంటూ లోకేష్ చేసిన కామెంట్స్తో ఆ నాయకుల నోళ్లు మూతపడ్డాయి. బెదిరింపులకు లొంగకుండా, బాధితులకు పూర్తి అండగా నిలబడి నారా లోకేష్ తన పరిణతిని చాటుకున్నారు.
ఈ ప్రమాదంపై కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ప్రమాదం జరిగిన కేవలం గంట వ్యవధిలోనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకోగా.. మరో గంటలో రాష్ట్ర హోంమంత్రి స్వయంగా వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు కేవలం నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం పూర్తింగా స్వస్తి పలికింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో ఫోన్లో మాట్లాడి, మృతుల కుటుంబాలకు ₹25 లక్షల తక్షణ ఎక్స్గ్రేషియాతో పాటు, ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చారిత్రాత్మక ఉత్తర్వులు ఇప్పించారు. గాయపడిన వారికి ₹10 లక్షల చొప్పున సాయం ప్రకటిస్తూ, మెరుగైన కార్పొరేట్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని జీవో జారీ చేయించారు. పరిహారం ప్రకటించడమే కాకుండా, బాధిత కుటుంబాల చేతికి ఆర్డర్ కాపీలు అందే వరకు లోకేష్ స్వయంగా పర్యవేక్షించడం ఆయన నిబద్ధతకు అద్దం పడుతోంది.
కూటమి ప్రభుత్వం బాధితులకు సర్వస్వం సమకూర్చి, ప్యాకేజీలు ప్రకటించిన తర్వాత..కేవలం రాజకీయ మైలేజ్ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యారు. ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన జగన్, ప్రెస్ మీట్ పెట్టగానే ఎప్పటిలాగే అబద్ధాల పురాణం విప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యానికి గురైందని, ప్రమాదాలు పెరిగిపోయాయని జగన్ ఆరోపించారు. కానీ, వాస్తవాలు వేరేలా ఉన్నాయి. జగన్ తన ఐదేళ్ల ముఖ్యమంత్రి పాలనలో ఒక్కటంటే ఒక్కసారి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవలేదు సగటు కార్మికుడి గోడు వినలేదు. ఆయన హయాంలోనే ప్లాంట్కు ముడిసరుకు కొరత తీవ్రమై, ప్లాంట్ మూతపడే స్థితికి చేరిందనేది జగన్ చెప్పలేని చేదు నిజం.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తామే అడ్డుకున్నామని, NDA ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. జగన్ సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో కేవలం కాలయాపన తీర్మానాలు చేయడం మినహా, కేంద్రంపై ఏనాడూ ఒత్తిడి తీసుకురాలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు LG పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు రూ. కోటి ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్, అదే ఐదేళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్లో, ఫార్మా సిటీలో జరిగిన ఎన్నో ప్రమాదాల్లో చనిపోయిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం నయాపైసా పరిహారం ఇప్పించలేకపోయారు.
విశాఖ ఉక్కు సాక్షిగా జరిగిన ఈ పరిణామాలు రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. విపక్షాలు, వైసీపీ అనుబంధ యూనియన్లు సృష్టించిన వ్యూహాత్మక ఉచ్చులో పడకుండా, బాధితుల పక్షాన కొండంత అండగా నిలబడి నారా లోకేష్ నిజమైన లీడర్ అనిపించుకున్నారు. అధికారం కోల్పోయినా ఇంకా అబద్ధాలు, శ*వ రాజకీయాలు నమ్ముకుని బతకాలని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డి వైఖరిని విశాఖ ప్రజలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు.











