వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో గత కొన్నాళ్లుగా వైసీపీ అనుసరిస్తున్న వ్యూహాలకు, ఆమె ఇచ్చిన సమాధానం పూర్తిగా విరుద్ధంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అమరావతికి బదులుగా మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, TV9 జర్నలిస్ట్ రజినీకాంత్ అడిగిన ఒక సూటి ప్రశ్నకు రోజా ఇచ్చిన రిప్లై ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశమైంది.
ఇంటర్వ్యూ సందర్భంగా రజినీకాంత్ స్పందిస్తూ..మీరు ఇల్లు అమరావతిలో కట్టుకుంటారా? లేక జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్లో కట్టుకుంటారా?” అని ప్రశ్నించారు. దీనికి రోజా ఏమాత్రం ఆలోచించకుండా “రెండూ ఒకటే కదా!” అని బదులిచ్చారు. భౌగోళికంగా ఆ ప్రాంతం ఒకటే అయినప్పటికీ, రాజకీయంగా అమరావతి అనే పేరును చెరిపివేసి మావిగన్ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్న వైసీపీ అధిష్టానానికి రోజా సమాధానం పెద్ద షాక్ అనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు అమరావతి అనేది గత ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని, మావిగన్ మాత్రమే అసలైన రాజధాని అని ఎలివేషన్లు ఇచ్చిన వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఈ వ్యాఖ్యలు మింగుడుపడటం లేదు.
నిజానికి, రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా స్పష్టమైన విభజన రేఖను గీసింది. అమరావతిని వ్యతిరేకిస్తూనే, మావిగన్ ప్రతిపాదన గొప్పదని చాటి చెప్పేందుకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రోజా వంటి కీలక నేత రెండు ఒకటే అని చెప్పడం ద్వారా, మావిగన్ అనే కొత్త ప్రతిపాదనలో పెద్ద గొప్పతనం ఏమీ లేదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇది కేవలం మాట జారడమా లేక పరోక్షంగా పార్టీ లైన్పై అసంతృప్తిని వ్యక్తం చేయడమా అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్న. ఈ ఒక్క సమాధానంతో అటు ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లయింది, ఇటు సొంత పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని డిఫెన్స్లో పడేశారు రోజా.











