అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో వడ్డించే తీరు రాజకీయాల్లో కొత్తేం కాదు. అయితే అయిన వారిని కాపాడుకుంటారనేది జగమెరిగిన సత్యమే అయినప్పటికీ.. ఆ బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా నడిపించేస్తారని, అందుకోసం దేవుడి సొమ్మును తగలేయడానికి కూడా వెనకాడరని తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.
సుమారు 9 నెలల కిందట జరిగిపోయిన వ్యవహారం.. అనుకోని విధంగా బయటపడడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలమీదనే స్వామి వారి భక్తులకు ఏవగింపు, అనుమానం జమిలిగా కలుగుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల వేంకటేశ్వరస్వామికి చెందిన కోట్ల రూపాయల విలువైన ‘పింక్ డైమండ్’ అదృశ్యం అయిందంటూ అప్పట్లో పుకార్లు గుప్పు మన్నాయి. రాజకీయ నాయకుల ప్రాబల్యంతో, అధికారులే వీటిని మాయం చేశారని.. దీని వెనుక బడాబాబుల హస్తం ఉన్నదని ప్రచారం జరిగింది. ప్రభుత్వం మీద కూడా విమర్శలు వచ్చాయి. సాక్షాత్తూ అదివరలో టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు.. ఏకంగా చెన్నైలోను, ఢిల్లీలోను ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో జగన్మోహనరెడ్డితో అంటకాగుతున్నట్లుగా విమర్శలకు గురైన రమణ దీక్షితులు, ఆ విమర్శలకు బలమిచ్చేలాగానే వ్యవహరించారు. పైగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడమే తడవుగా.. అప్పటి ప్రభుత్వాధినేతలే పింక్ డైమండ్ ను ఎత్తుకు వెళ్లిపోయినట్లుగా అర్థం వచ్చేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి పెద్దఎత్తున ప్రచారాన్ని అందిపుచ్చుకున్నారు. ఏకవాక్యంలో చెప్పాలంటే.. పింక్ డైమండ్ అనేది ఉందో లేదో స్పష్టత లేకపోయినా.. ఆ పదం చుట్టూ టీటీడీ పరువును బజార్లో పెట్టడానికి ప్రయత్నం జరిగింది.
ఆ వ్యవహారం మీద.. టీటీడీ అప్పట్లోనే కోర్టులో వందకోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. పింక్ డైమండ్ మాయమైనట్లుగా ఆరోపణలు చేసిన దుష్ప్రచారం సాగించిన రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి.. చెరో వంద కోట్ల రూపాయలు పరిహారం కట్టాలంటూ తిరుపతి 10వ అదనపు జిల్లాకోర్టులో పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం కేసు నిబంధనల ప్రకారం.. అందుకోసం రెండు కోట్ల రూపాయల కోర్టు ఫీజులు కూడా చెల్లించారు. కేసు కోర్టులో ఉండగానే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది.
ఆ వెంటనే టీటీడీ ఛైర్మన్ గా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. స్వామివారి సన్నిధిలో ఆయన పాలన ప్రారంభం అయింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాలకమండలిలో 447 నెంబరుతో ఒక తీర్మాం చేశారు. విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు స్వామివారిపై నమ్మకం ఉన్నట్లుగా ప్రకటించినందున.. ఈ కేసును ఉపసంహరించుకోవాలని అందులో తీర్మానించారు. వారిద్దరు ఎప్పుడు ప్రకటించారో.. ఈ తీర్మానం ఎప్పుడు చేశారో.. ఆ మేరకు కోర్టుకేసును ఎప్పుడు విత్ డ్రా పిటిషన్ వేశారో.. ఇదంతా కూడా అత్యంత రహస్యంగా ఉంచారు. దాదాపు 9 నెలలు అవుతున్నా.. ఎక్కడా సంగతి లీక్ కాలేదు.
అయితే యాదృచ్ఛికంగా మరో సంఘటన జరిగింది. తెలంగాణకు చెందిన హిందూ జనశక్తి సంస్థ తాజాగా ఈ పరువు నష్టం కేసులో తమను కూడా ఇంప్లీడ్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. అప్పుడే.. అసలు పిటిషనర్లు విత్ డ్రా పిటిషన్ వేసి ఉన్న సంగతి బయటకు వచ్చింది. ఈ కేసు వెనక్కు తీసుకునేందుకు.. కోర్టులో కట్టిన రెండు కోట్లరూపాయలను కూడా వదులుకోడానికి టీటీడీ సిద్ధపడినట్లు బయటకు వచ్చింది.
సొంత పార్టీ మీద అంత ప్రేమా..
సొంత పార్టీ మీద టీటీడీ పాలకమండలి పెద్దలకు ప్రేమ ఉండవచ్చు. ఏదో వారు పంపే సిఫారసు ఉత్తరాలకు దొడ్డిదారిన అయినా దర్శన సదుపాయాలు కల్పించే వరకు అలాంటి ప్రేమను పరిమితం చేసుకుంటే బాగుంటుంది గానీ.. ఏకంగా.. స్వామివారి ఖజానాకు రెండు కోట్ల రూపాయలు గండి కొట్టేలా, స్వామి వారి పరువును మంటగలిపిన వారిని ఉపేక్షిస్తూ.. స్వామి ద్రోహం చేసేలా పిటిషన్ వెనక్కు తీసుకోవడమే ఆశ్చర్యకరంగా ఉంది.
సొంతపార్టీ వారికి మేలు చేయడానికి తిరుమలేశుని ప్రయోజనాల్ని, పరువును, సొమ్మును కూడా పణంగా పెట్టేస్తారా? అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వీటిపై టీటీడీ అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.











