విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి వైఎస్సార్సీపీ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడకు రాజధానిని తరలించబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం బలంగా ఉంటే.. అక్కడ రకరకాల చికాకులు ఎదురవుతాయనే ఉద్దేశం కూడా ఇందుకు కారణం కావొచ్చు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో లేనంతగా.. విశాఖలో మాత్రమే.. తెదేపా నుంచి ఫిరాయింపుల్ని జగన్మోహన రెడ్డి ఆశిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల రాజకీయంగా లాభం ఉంటుంది. తెలుగుదేశానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. దానితో పాటు, విశాఖకు రాజధాని రావడం.. విశాఖ వాసులకు కూడా ఇష్టం లేదు.. అని అదే ప్రజాగళంగా వినిపిస్తున్న చంద్రబాబునాయుడు వాదనను నైతికంగా బలమైన దెబ్బ కొట్టినట్టు అవుతుంది.
విశాఖలో తెలుగుదేశం ఖాళీ కాబోతున్నదంటూ ‘విశాఖ దేశం గల్లంతేనా’ అనే శీర్షికతో సెప్టెంబరు 5న లియోన్యూస్ డాట్ కామ్ ఒక ప్రత్యేక కథనం కూడా అందించింది.
అచట ద్వారము తెరచియే యున్నది : విశాఖ దేశం గల్లంతేనా…
విశాఖపట్నంలో సౌత్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేశ్ వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారు. శనివారమే ఆయన చేరికకు ముహూర్తం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నట్టు సమాచారం. కండువా కప్పుకోకపోవచ్చు గానీ.. పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. ఆయన చాన్నాళ్లుగా విశాఖలో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి తరహాలోనే కండువా కప్పుకోకుండా వాసుపల్లి గణేశ్ చేరిక కూడా ఉంటుంది.
విశాఖ తెదేపా.. లోకల్ లీడర్ల భవిష్యత్తేంటి?
నిజానికి విశాఖపట్నం తెలుగుదేశం నాయకులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. అక్కడి పార్టీ పరిస్థితిపై ఆగస్టు 10వ తేదీనే లియోన్యూస్ డాట్ కామ్ లోకల్ లీడర్ల భవిష్యత్తేంటి అనే శీర్షికతో ఒక కథనం అందించింది. ఇక్కడకు వస్తున్న రాజధానిని పార్టీ విధానాల ప్రకారం వ్యతిరేకిస్తే గనుక ప్రజలు తమను ఆదరించరేమోనన్న భయం వారిలో ఉంది. ఇలాంటి భయాన్ని వైసీపీ చక్కగా క్యాష్ చేసుకుంటోంది. పంచకర్ల రమేష్ బాబు వంటి వారు కూడా వైసీపీలో చేరిపోయారు. నిజానికి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు నాయకులు వలస రావడంపై స్థానిక వైసీపీ ప్రముఖులు ముత్తంశెట్టి శ్రీనివాస్, విజయసాయి లాంటి వాళ్లకు భిన్నాభిప్రాయాలున్నా.. జగన్ ఆలోచన మేరకు మౌనం పాటిస్తున్నారు.
తెలుగుదేశానికి విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలున్నారు. గంటా శ్రీనివాసరావు ఉన్నా లేనట్టే. ఆయన పేరుకు తెదేపా ఎమ్మెల్యేనే గానీ.. పార్టీతో ఎన్నడో తెగతెంపులు చేసేసుకున్నారు. వాసుపల్లి గణేశ్ ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్నారు. ఇక విశాఖ వెస్ట్ నుంచి గెలిచిన గణబాబు, ఈస్ట్ నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు మిగిలారు. వీరిలో రామకృష్ణబాబును పార్టీలోకి తీసుకురావడానికి ఆల్రెడీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయమై వారం కిందటే లియోన్యూస్ డాట్ కామ్ ఒక కథనం అందించింది.
ఆ ఎమ్మెల్యే కోసం గేలం వేసి వెయిట్ చేస్తున్న కొడాలి!
వెలగపూడి రామకృష్ణ బాబు కమ్మ వర్గానికి చెందిన నేత కావడంతో.. అటు కుల సమీకరణల పరంగా, విశాఖ పరంగా చంద్రబాబును రెండు రకాలుగా దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అందుకే జగన్ ఆ బాధ్యతను కొడాలి నానికి అప్పగించినట్టు సమాచారం. రామకృష్ణ బాబు కూడా చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి?
విశాఖపట్నంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నాలుగు నియోజకవర్గాలూ తెలుగుదేశమే గెలిచింది. ఒక్కరైనా పార్టీలో మిగిలి ఉంటారో లేదో తెలియని పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలంతా వెళ్లిపోయి, అధికార పదవుల్లేని పార్టీ నాయకులు కూడా కొందరు నెమ్మదిగా జారుకుంటే.. ఒకప్పుడు విశాఖ పట్నంలో వైభవం వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోతుంది.