ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడం చేతకాక ఇలా ఢిల్లీకి వెళ్లి రాజకీయాలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే జరిగితే వైసీపీలో మరింత పెద్ద బీటలు వారడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కడప ఎంపీ సీటు వైఎస్ ఫ్యామిలీని రెండు ముక్కలుగా చేసింది. ఆ ఎంపీ సీటు కేంద్రంగానే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మొన్నటి ఎన్నికల్లో పోటీ పడ్డారు. వైఎస్ అవినాష్ వైసీపీ నుంచి, వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఓటమి నుంచి వైఎస్ అవినాష్ త్రుటిలో తప్పించుకున్నారు.
ఇప్పటికే వైసీపీలో అంతరాలు బలపడగా.. మళ్లీ అదే కడప ఎంపీ సీటు కారణంగా పార్టీ మూడు ముక్కలుగా అవుతుందని అంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి జగన్ సిద్దపడితే, ఆ పదవిలో ప్రస్తుతం కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేయడానికి ఒప్పుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే వైఎస్ వివేకా కేసు కత్తి.. అవినాష్ రెడ్డి గొంతు మీద వేలాడుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు రక్షణ కవచమని అవినాష్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.
అటు జగన్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడంతో అక్రమాస్తుల కేసులు జగన్ ను తీవ్రంగా భయపెట్టిస్తున్నాయి. అందుకే ఈ కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు పార్లమెంట్ కు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వివేకా కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉండగా.. ఎంపీ పదవిని కూడా కోల్పోతే మరిన్ని చిక్కులు ఎదురవుతాయని అంటున్నారు. గత ఏడాది కూడా సీబీఐ దాదాపు అరెస్టు చేసేస్తుందన్న సమయంలో కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాను ఎంపీ అని, ప్రజల సమస్యల కోసం పోరాడాల్సి ఉందని బెయిల్ పొందారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఆదేశాల మేరకు పదవిని వదిలేసుకుంటే రేపు పరిస్థితి ఏంటనేది అవినాష్ రెడ్డి భయపడుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ తన అవసరాల కోసం ఏమైనా చేస్తాడని, అవసరమైతే తమ్ముడ్ని కూడా బలిపశువును చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కడప ఎంపీగా పోటీ చేయాలని జగన్ నిర్ణయించుకుంటే, అవినాష్ రెడ్డి తన భద్రత కోసం జగన్ ను ఎదిరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే వైఎస్ ఫ్యామిలీ మూడు చీలికలుగా మారడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల విజయమ్మ కారణంగా కుటుంబం జగన్ నుంచి చీలిపోయిన సంగతి తెలిసిందే