మిగ్జాం తుపాను ముగిసినప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించకుండా, బాధితులను పరామర్శించకుండా సీఎం జగన్ ఏసీ గదుల్లో సమీక్షలు మాత్రమే చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు పెట్టి.. వారి చెప్పేది చిరునవ్వుతో వింటూ సమావేశాలు ముగించారు. చివరికి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన మొదలు కాగానే, అప్పుడు మేల్కొన్న జగన్ తాను కూడా పర్యటనను మొదలు పెట్టేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు తన పర్యటనలో భాగంగా రైతుల వద్ద అన్నారు. తాను తుపాను బాధితుల వద్దకు పర్యటన మొదలుపెట్టినప్పుడే.. సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని చంద్రబాబు విమర్శించారు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదని అన్నారు.
చంద్రబాబు మిగ్జాం తుపాను ప్రాంతాల పర్యటనకు శుక్రవారం చంద్రబాబు బయల్దేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు మార్గం ద్వారా తెనాలికి వెళ్తూ మధ్యలో ఆగారు. రేవేంద్రపాడు అనే గ్రామం వద్ద రైతులను చంద్రబాబు కలిశారు. తుపాను ధాటికి పంట నష్టం జరిగిన రైతులను చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం ఇప్పటిదాకా పంట నష్టం మీద అంచనా వేయడానికి రాలేదని చంద్రబాబుకు రైతులు వివరించారు. వారితో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు ఇక మూడు నెలలే అని అన్నారు. పొలాల్లో ఉండి రైతు కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులెక్కడున్నారని చంద్రబాబు నిలదీశారు. తాను తన హాయాంలో పంట నష్టపరిహారం పెంచుకుంటూ వెళ్తే.. జగన్ మాత్రం తగ్గించారని అన్నారు. కనీసం పంటపై ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని.. రైతులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా కల్పించారు.
చంద్రబాబు పర్యటన ఖరారయ్యాక తన టూర్ ప్రారంభించిన జగన్ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు పరిసర ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. పొలాల్లో పర్యటించింది తక్కువ.. ఫోటో ఎగ్జిబిషన్లు సందర్శించింది ఎక్కువ అన్న చందంగా వ్యవహరించారు. నష్టపోయిన పొలాల్లో కలయతిరుగుతూ రైతులను పరామర్శించాల్సింది పోయి.. పంట నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఆ తర్వాత మొక్కుబడిగా తిరుగుతూ బాధిత రైతులు వేదనలో ఉంటే.. వారిని చిక్కని చిరునవ్వుతో పలకరించారు. తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలు వారి పాలెంలో సీఎం జగన్ పర్యటించారు. అక్కడి కర్లపాలెం మండలం పాతనందాయ పాలెం, బుద్ధాం గ్రామాల్లో జగన్ పర్యటన సాగింది. వరి పంటలను పరిశీలించి రైతులతో సీఎం మొక్కుబడిగా మాట్లాడి వెళ్లిపోయారు.











