సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్ జూనియర్ సివిల్ కోర్టు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అంబటి రాంబాబు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా…పోలీసుల తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విజయలక్ష్మి, జగదీష్లు వాదనలు వినిపించారు.
అసలు ఏం జరిగింది..!
శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు తన వాహనంలో వస్తూ పోలీసులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై TDP కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు SI ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీసుస్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అంబటిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు పోలీసుస్టేషన్కు తరలించి ఆదివారం రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. రాత్రి 8.45 గంటలకు స్థానిక ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
రాంబాబు తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అంబటి రాంబాబుకు ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వమే సమాజంలో అలజడి సృష్టించడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని బాధ్యత గల పౌరుడిగా అంబటి రాంబాబు వాటిని తొలగించాలని కోరారన్నారు. ఆయనపై నమోదయిన నేరాలన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున రాంబాబుకు రిమాండ్ విధించవద్దని కోరారు. అంబటి రాంబాబు కూడా తనకు 68 ఏళ్ల వయసు ఉందని, న్యాయవాదిగా, ఎమ్మెల్యే, మంత్రిగా విధులు నిర్వహించానని చెప్పారు.
ఇక, పొన్నవోలు వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తోసిపుచ్చారు. అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16కుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో మూడొంతులు ఆయన పోలీసులను దుర్భాషలాడటం, వారి విధులకు ఆటంకం కలిగించడంపై నమోదైనవేనన్నారు. సీఎం చంద్రబాబుపై కావాలనే వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, దీనివెనుక ఉన్న కుట్రదారులను తేల్చాల్సి ఉందన్నారు. అంబటిని విడుదల చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఆయనను పోలీసు కస్టడీకి తీసుకుంటామని, రిమాండ్ విధించాలని కోరారు.
సీఎం చంద్రబాబుపై ఆయన చేసిన కామెంట్స్ను పరిశీలించాలంటూ న్యాయమూర్తికి వీడియో చూపించారు. ఆ తర్వాత అంబటి రాంబాబును న్యాయమూర్తి తన కార్యాలయంలోకి పిలిచి ఆయన వాంగూల్మం నమోదు చేశారు. రాత్రి 11.25 గంటల సమయంలో రాంబాబుకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి జి.స్రవంతి ప్రకటించారు. తనను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని రాంబాబు కోరగా ఆ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.











