సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం బడ్జెట్లో 6 వేల 357 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి.. లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా పేదల గృహ నిర్మాణానికి రెండున్నర లక్షల వరకు మంజూరు చేస్తారు.
రాష్ట్రంలో అర్హులైన పేదవాళ్లందరికీ ఈ పథకం ద్వారా ఇంటిని మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం చేయడంతో సరిపెట్టకుండా.. పేదలకు ప్రత్యేకంగా కాలనీలు నిర్మించి.. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల వంటి మౌళిక సదుపాయాలు కల్పించనున్నారు. అదే విధంగా నిరుపేదలకు ఆర్ధిక భారం తగ్గించేందుకు సిమెంట్, ఇటుకలు, స్టీల్ వంటి నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరలకే అందజేస్తారు. పారదర్శకమైన విధానం ద్వారా పథకం నిధులను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకొంటున్నారు.
ఒకేసారి ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు గూడు దొరకడమే కాకుండా.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సిమెంట్, స్టీల్, ఇటుకల వంటి పరిశ్రమలు లాభపడతాయి. కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించి.. మోడల్ విలేజ్లుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. పేదవాడి సొంతింటి కల నేరవేర్చడమే పరమావధిగా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది కూటమి ప్రభుత్వం..











