ఏపీలో కొన్ని ఉద్యోగ సంఘాలు.. ఎన్నికలను బహిష్కరిస్తామని పిలుపునివ్వడం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ ఆ ఉద్యోగ సంఘాలకు లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మద్య వివాదం తలెత్తింది. హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. అది వ్యవస్థల మధ్య నలుగుతున్న అంశం. ఆ వివాదం నడుస్తుండగానే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ మొన్న ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల తేదీలను, కోడ్ వర్తించే అంశాలను వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నిక సంఘ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో తామేమీ తక్కువ కాదంటూ..కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించాయి. ఓ వ్యవస్థపై నేరుగా తిరుగుబాటు ప్రకటించాయని చెప్పవచ్చు. ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాల, తమ మనోభావాలను, తమ హక్కుల కోసం పోరాడడాన్ని ఎవరూ కాదనరు. కాని ఎవరి మెప్పో పొందేందుకు ఇలా చేస్తున్నారనే స్థాయిలో వారి విమర్శలు ఉండడమే చర్చకు కారణమైంది.
గతంలో ఎప్పుడూ..
వాస్తవానికి ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నడూ ఈ రీతిలో స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన, సమైఖ్యాంధ్ర ఉద్యమ హోరులోనూ ఉద్యోగ సంఘాలు తమతమ విలువ కాపాడుకున్నాయి. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని ఉదాహరణలను ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది.
- తెలంగాణ ఉద్యమంలో భాగంలో చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటం చేశారు. వారిలో కొందరికి పదవులు వచ్చాయి. కొందరికి రాలేదు. అయితే.. పదవులు వచ్చినా..ఉద్యోగ సంఘాల విషయంలో సదరు నేతలు చాలావరకు రాజీపడలేదు.
- ఎవరినీ నోరెత్తకుండా చేసే వ్యక్తిగా పేరున్న కేసీఆర్ లాంటి నేత పాలనలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
- మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను, కొన్ని విభాగాల్లోని ఉద్యోగుల ప్రభుత్వం ఎన్నికల విధులకు దూరంగా ఉంచిందని, అందుకు కారణం గతంలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందనే ఆందోళనే ఇందుకు కారణమనే చర్చ కూడా నడిచింది.
- రానున్న ఎన్నికల్లో మళ్లీ ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ పీఆర్సీపై రివ్యూ కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. అంటే.. ఉద్యోగ సంఘాలంటే..ప్రభుత్వాలకు గౌరవం, భయం రెండూ ఉంటేనే.. వ్యవస్థలు సక్రమంగా నడుస్తాయని చెప్పవచ్చు.
- తెలంగాణలో పలు ఉద్యోగ సంఘాలు..తమ తమ డిమాండ్ల కోసం పదవులతో, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పోరాడుతున్నాయి. పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీవారు కాకుండా వేరే పార్టీవారూ గెలుస్తున్నారు.
- మిగతా రాజకీయం వేరు..ఉద్యోగ సంఘాల హక్కులు, ఉద్యోగ సంఘాల వైఖరి వేరు అనే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పవచ్చు.
- రానున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి వ్యతిరేకతా ఉండదనే అభిప్రాయం కూడా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో అదే జరిగింది. తమ హక్కుల సాధనకు, డిమాండ్ల సాధనకు పోరాడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయన్న చర్చ ఉంది. అప్పుడప్పుడు నాయకులు చేసే ప్రకటనలతో విభేధించినా..లేదా ప్రభుత్వాలకు సహకరించినా.. అప్పటివరకే అది పరిమితం అవుతుంది.
- తమిళనాడులో మొన్న బీజేపీకి చెందిన ఓ నేత, అధికార పార్టీకి చెందిన మరో నాయకుడు ఓ ప్రభుత్వోద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినంత పనిచేశాయి. అదే సమయంలో వరదలు వచ్చిన సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టిన వారికి, కొవిడ్ సమయంలో విధులు నిర్వర్తించిన వారికి అదనపు అలవెన్సులు, అదనపు భత్యాల కోసం కేరళలో పోరాటం చేసి సాధించారు.
- ఇక ఉమ్మడి ఏపీలో కావచ్చు.. తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇలా చాలా రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాల నేతలకు ఆయా రాష్ట్రాల సీఎంలు అపాయింట్మెంట్ కూడా వెంటనే ఇస్తారంటే..సదరు సంఘాల వ్యవహారశైలి.. రాజీపడని తత్వం, సిద్ధాంతాలు, ప్రియార్టీ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
దొరికితే..లొంగుబాటేనా..
- తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని సంఘాల నాయకులు అధికార పార్టీకి మద్దతుగా నిలవడం, ఆ పార్టీకి చెందిన కీలక నేత ఇంట్లో భోజనం చేయడం విమర్శలకు కారణమైంది. ఈ విషయంలో మరో ఆరోపణ కూడా ఉంది. ఈ సంఘాల్లో ఒకరిద్దరు వ్యక్తులపై కొన్ని అంశాలు రహస్యంగా ఉన్నాయని, అవి బయటకు తీస్తే..సదరు వ్యక్తులకు భారీ నష్టం రావడంతోపాటు పరువు పోవడం ఖాయమన్న భయంతోనే ప్రభుత్వానికి లొంగిపోయారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. కాని ఆర్టీసీ సమ్మె మాత్రం కొనసాగింది. చివరకు చర్చలు సఫలం కావడం తరవాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్ల అస్తిత్వానికే ప్రమాదం వచ్చిన విషయం కూడా తెలిసిందే.
ఏపీలో అదే జరగనుందా..
- ఏపీలో ఇటీవల కొన్ని ఉద్యోగ సంఘాల నాయకుల వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఆ సంఘాల నాయకుల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. పదవుల కోసమో లేక మరో విధంగా లబ్ధి పొందేందుకు ప్రభుత్వానికి జీహుజూర్ అంటున్నారన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు..ఫక్తు అధికార పార్టీ నాయకుల్లా ప్రతిపక్షాలపై లేదా..ప్రభుత్వంతో విభేధించే వారిపై వ్యాఖ్యలు చేసే పరిస్థితి తలెత్తింది. ఓ విషయంలో శాసన మండలి ఛైర్మన్పై కూడా డైరెక్ట్గా రూల్స్ తెలియవా అని ప్రశ్నించే పరిస్థితికి వచ్చారన్న చర్చ మొదలైంది. ఆ విషయంలో వారు చెప్పింది సమర్థించే వారు కూడా తరువాత ఉద్యోగసంఘాల వైఖరితో విభేధిస్తున్నారు. ఏపీలో కొన్ని ఉద్యోగ సంఘాలు.. తమకు హక్కులుంటాయన్న విషయం మర్చిపోయి..ప్రభుత్వంపై ఈగ వాలనీయకుండా చూసే బాధ్యతను మోస్తున్నారన్న చర్చ మొదలైంది. పీఆర్సీ విషయం, సీపీఎస్ విధానం ఎత్తివేత, డీఏ చెల్లింపులు, బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం, పెండింగ్ వేతనాల చెల్లింపులు, ఉద్యోగుల విషయంలో కొందరు ప్రజాప్రతినిధుల దురుసు ప్రవర్తన లాంటి విషయాల్లో పట్టనట్టుఉంటున్న కొన్ని సంఘాలు.. ప్రభుత్వాన్ని టచ్ చేయాలంటే..ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే.. ఉద్యోగ సంఘాలు హక్కుల కోసం పోరాడడం కాకుండా.. కేవలం ప్రభుత్వానికి బాకా ఊదడమే లక్ష్యంగా పెట్టుకుంటాయని, అదే జరిగితే.. ప్రజలే ఛీ కొడతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.











