దివంగత ముఖ్యమంత్రి , టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అదేసమయంలో వారంతా ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీఆర్ భౌతికంగా తమ మధ్యన లేకపోవడం తీరని లొటని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లే తాను ఒక నటుడిగా అందరి ముందు ఉన్నానన్న రాజేంద్రప్రసాద్.. ఎన్టీఆరే తనకు దేవుడని అన్నారు. కొన్ని ఏళ్ల పాటు తాను ఆయన పక్కనే ఉన్నానని తెలిపారు. సమాజమే దేవాలయం అని నమ్మిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మన కళ్లతో మనం చూసిన దేవుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఈ రోజు ఆ మహనీయుడు బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని అన్నారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయని చెప్పారు. పది మందికీ సహాయం చేయడమే ఎన్టీఆర్ కు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు