ప్రస్తుతం నటసింహ బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ సినిమామీద విపరీతమైన అంచనాలేర్పడ్డాయి. లాక్ డౌన్ వల్ల అంతరాయం ఏర్పడిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవల పునఃప్రారంభమైంది. ఇక ఇందులో కథానాయికగా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వల్ ఎంపికవగా.. మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. కాగా.. ఇందులో ఒక యమ్మెల్యే పాత్రకోసం సౌత్ బబ్లీ గాళ్ నమితను ఎంపికచేసినట్టు తెలుస్తోంది.
మొన్నామధ్య పెళ్ళిచేసుకొని సినిమాలు తగ్గించిన నమిత.. ఇప్పుడు కాస్తంత స్లిమ్ గా మారి మళ్ళీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలో బోయపాటి శ్రీను ఆమెకు ఇందులో యమ్మెల్యే పాత్రకోసం ఎంపికచేశాడట. గతంలో బాలయ్య నటించిన బోయపాటి చిత్రం ‘సింహ’లో నమిత నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ.. తదుపరి అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మరి నమితకు ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.