ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ కొత్త మలుపు తిరగనుంది స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరుగుతోంది. పలుమార్లు దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారితో రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను పంపించి చర్చలు జరపాలని, ఎన్నికల నిర్వహణపై ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. అయితే అసలు చర్చలు జరుగుతాయా లేక మరో వివాదం తలెత్తుతుందా అనేది చూడాలి.
గత మార్చిలో కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పట్లో దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులతోసహా వైసీపీ వర్గాలు విమర్శలకు దిగాయి. వ్యక్తిగత విమర్శలూ చోటుచేసుకున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధం కాగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని చెబుతోంది. అప్పటినుంచి ఎన్నికల నిర్వహణ వివాదం తారస్థాయికి చేరింది. మొత్తంమీద వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం పట్టుబట్టగా వాయిదాకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. కాగా ప్రస్తుత ఎస్ఈసీ పదవీకాలం మార్చితో పూర్తి కానుంది.
ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంతోపాటు కొత్త అంశంకూడా తెరపైకి వచ్చింది. కొవిడ్ రెండో దశ పై ఇప్పటివరకు అంచనాలే ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ కొవిడ్ కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రిలో ఈ కేసు నమోదైంది. ఈ స్ట్రెయిన్ ప్రమాదకరంగా మారిందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. కొన్నిరకాల ఆంక్షలు విధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కూడా ఇచ్చింది. దీనిపై అటు ఎస్ ఈ సీ, ఇటు ప్రభుత్వం ఎలా స్పందిస్తాయనే అంశంపై రాజకీయ చర్చ జరుగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికలను వద్దనుకుంటున్న ప్రభుత్వానికి స్ట్రెయిన్ అంశం కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. కొవిడ్ ఇంకా తగ్గలేదని, రోజూ కేసులు నమోదు అవుతున్నాయని, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతున్న వైసీపీ సర్కారు.. కొత్త స్ర్టెయిన్ ను తెరపైకి తేవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు కరోనా కొత్త స్ట్రెయిన్లపైనా వ్యాక్సిన్ లు పనిచేస్తాయని, కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కె.విజయ్ రాఘవన్ ఇప్పటికే ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకునే వ్యాక్సిన్లు తయారు అవుతాయని, కొత్త స్ట్రెయిన్పై టీకా పనిచేయదని చెప్పేందుకు ఆధారాలు లేవని రాఘవన్ వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం పంపించే అధికారుల టీం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ మేరకు ఏకాభిప్రాయానికి వస్తారో చూడాలి. మొత్తం మీద ప్రభుత్వం పంపించే ప్రతినిధులతో ఎన్నికల సంఘం చర్చలు, కొత్త స్ట్రెయిన్ అంశం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది.