బ్రిటన్ కొవిషీల్డ్కి అనుమతులు ఇవ్వడంతో.. భారత్ కూడా వ్యాక్సిన్ విషయంలో తన ఒక నిర్ణయం వెలవడబోతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ ఏ విషయం తేల్చకుండానే మీటింగ్ని ముగించింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ). తిరిగి జనవరి 1న వ్యాక్సిన్ గురించిన మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత తక్కువ ధర నిర్ణయించిన వ్యాక్సిన్గా కొవిషీల్డ్ పేరు తెచ్చుకుంది. అన్ని దేశాలకు ప్రస్తుత పరిస్థితులను బట్టి ధర తక్కువ నిర్ణయించినట్టు యాజమాన్యం తెలిపింది. బ్రిటన్ అంగీకారంతో.. భారత్లో కూడా అనుమతులు లభిస్తాయని ఎదురుచూస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే భారత్ కోసం 50 మిలియన్ల డోసులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది సీరమ్ సంస్థ. మరి రేపటి రోజునైనా వ్యాక్సిన్ విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశిద్దాం.
25కి చేరిన కొత్తరకం కరోనా కేసులు
కేవలం 6 కేసులే కదా అనుకుంటున్న సమయంలో.. కేవలం ఒక్కరోజులో 14 కొత్తరకం కేసులు నిర్థారణ అవడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వీటిలో 7 కేసులు కర్ణాటకకు సంబంధించినవి కావడం ప్రస్తుతం ఆ రాష్ట్రాన్ని కలవరపెడుతున్న విషయం. వీరితో సన్నిహితంగా మెలిగిన 46 మందిని ఎక్కడికక్కడ ఐసోలేషన్ చేశారు అధికారులు. తాజాగా మరో 5 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం అధికారక లెక్కలు విడుదల చేసింది. ఈ విషయాలతో అప్రమత్తమైన అధికారులు నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు యూకే దేశం నుండి దాదాపు 33 వేల మంది భారత్కు వచ్చినట్లు గుర్తించారు. వీరందరినీ గుర్తించి ఆర్టిపిసీఆర్ టెస్ట్లు నిర్వహించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో 279 మంది యూకే నుంచి వచ్చిన వ్యక్తుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అల్గేరియాలో వ్యాక్సినేషన్
జనవరి నుంచి రష్యా వ్యాక్సిన్ సుత్నిక్-వి ని దేశంలోని ప్రజలకు అందించడానికి అల్గేరియా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అక్కడి ప్రభుత్వం, రష్యాతో అధికారక అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా 5 లక్షల డోసులు రష్యా నుంచి అందుకోనున్నట్లు అల్గేరియా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అల్గేరియాలో ఇప్పటి వరకు లక్ష కేసులు నమోదయ్యాయి.. 2,700 మంది కరోనా దాటికి మరణించారు.