వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ ప్రధాన కాలువ – LMC ఫస్ట్ ఫేజ్లోకి నీటిని విడుదల చేసి, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జలహారతి ఇవ్వడం కూటమి ప్రభుత్వం పట్టుదలకు నిదర్శనం. ఐదేళ్ల పాటు తట్టెడు మట్టి పని కూడా జరగక మూలనపడ్డ కాలువ పనులను, అధికారం చేపట్టిన వెంటనే పరుగులు పెట్టించి ఉత్తరాంధ్ర వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది.
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా అత్యంత సంక్లిష్టమైనది. ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను దాటుకుంటూ, 11 ప్రాంతాల్లో జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ ఈ కాలువను తీర్చిదిద్దారు. ముఖ్యంగా కుమ్మరిలోవ వద్ద ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న భూసేకరణ చిక్కుళ్లను పరిష్కరించడమే కాకుండా, 100 మీటర్ల లోతు వరకు కొండను కట్ చేసి కాలువ పనులను పూర్తి చేయడం సాధారణ విషయం కాదు. సాంకేతిక అవాంతరాలు, వేలాది నిర్మాణాల తరలింపు సవాళ్లను అధిగమించి స్వల్ప వ్యవధిలోనే LMC ఫస్ట్ ఫేజ్ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ ప్రాజెక్టు కేవలం వ్యవసాయ భూములను తడిపే కాలువ మాత్రమే కాదు.ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగానికి బలమైన రక్షణ కవచం. విశాఖపట్నం నగరానికి తాగునీరు అందించడంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, భవిష్యత్తులో రాబోయే భారీ పరిశ్రమలకు వాటర్ సెక్యూరిటీని కల్పిస్తుంది. పారిశ్రామిక రంగానికి అవసరమైన మౌలిక వసతుల్లో నీరు ప్రధానం. ఈ జలాల రాకతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వరదెత్తే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉపాధి కోసం ముంబై, సూరత్, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లిన ఉత్తరాంధ్ర యువతకు, ఇప్పుడు సొంత గడ్డపైనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో కృష్ణా జలాలను ఉమ్మడి ప్రకాశం జిల్లాకు, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తూ నదుల అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణానికి రూ.29 కోట్లు వెచ్చించి అదనంగా 1,500 క్యూసెక్కుల నీటిని సిద్ధం చేయడం, రాబోయే రెండేళ్లలో రూ.2,500 కోట్లతో ఉత్తరాంధ్రలోని 11 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వానికున్న స్పష్టత వ్యక్తమవుతోంది. దశాబ్దాల తరబడి కాగితాలకే పరిమితమైన నేరడి బ్యారేజీకి అనుమతులు సాధించి, త్వరలోనే పనులు పట్టాలెక్కిస్తుండటం ఉత్తరాంధ్రకు అతి పెద్ద ఊరట..
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరుతుండడంతో ఈ ప్రాంత రాజకీయ రూపురేఖలు కూడా సమూలంగా మారబోతున్నాయి. గతంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారికి గోదావరి జలాల నిరంతర ప్రవాహమే చక్కని సమాధానంగా నిలిచింది. కృష్ణా-గోదావరి జలాల సరైన వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్ను జల సమృద్ధి రాష్ట్రంగా మార్చే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో ప్రధాన జీవనాడిలా పనిచేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. .











