ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి మొదలయిందనే సంకేతాలు ఆ పార్టీ నేతలకు ఎప్పటినుండో అందుతున్నాయి.. ముఖ్యంగా సంక్షేమ పథకాల మీదే ఫోకస్ పెట్టడంతో, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి.. చంద్రబాబు హయాంలో దాదాపు 70 శాతానికిపైగా పూర్తయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ని జగన్ సర్కార్ ఎక్కడికి అక్కడే నిలిపివేసింది.. ఇంచ్ కూడా ముందుకు కదిలించలేకపోయింది.. వైజాగ్కి వచ్చిన అనేక పారిశ్రామిక పెట్టుబడులు, కంపెనీలను జగన్ తరిమివేశారు.. ఒక్క అదానీ ప్రాజెక్టులకే ఎదురేగి మరీ స్వాగతం పలికారనే అభిప్రాయం ఉత్తరాంధ్ర వాసులలో వినిపిస్తోంది..
అంతేకాదు, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్గా వ్యవహరించిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అనుచరులు అనేక దందాలకు పాల్పడ్డారనే కథనాలు ఉన్నాయి.. అనేక భూ కుంభకోణాలు చేశారనే ఆరోపణలు వినిపించాయి.. వీటితో ఉత్తరాంధ్ర వాసులలో జగన్ సర్కార్పై వ్యతిరేకత వ్యక్తం అయింది.. ఇటు, అమరావతిని రాజధానిగా తీసేసి, ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖను చేస్తామని జగన్ సర్కార్ పదే పదే చెబుతున్నా, అక్కడి స్థానికుల నుండి సానుకూల స్పందన రాకపోవడం వైసీపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది.. అందుకే, ఉత్తరాంధ్రకు రాజధాని అని జగన్ సర్కార్ లీకులు ఇస్తున్నా, అక్కడి ప్రజల నుండి పాజిటివ్ వేవ్ కనిపించకపోవడంతో .. మాటలకే రాజధానిని పరిమితం చేసే ఆలోచనలో జగన్ టీమ్ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.. ఉత్తరాంధ్ర వాసుల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కుపై జగన్ సర్కార్ పోరాటం చేయకపోవడం, దానిని అదానీ గ్రూపుకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న లీకులతో స్థానికులు జగన్ సర్కార్పై ఆశలు వదిలేసుకున్నారు.. దీంతో, ఉత్తరాంధ్ర వాసుల మనసు దోచుకోవడం కోసం జగన్ పడరాని పాట్లు పడుతున్నారన్న అభిప్రాయం ఉంది..
అమరావతి నుండి రాజధానిని తీసేయాలని నిర్ణయించడంతో.. ఈ దఫా ఎన్నికలలో జగన్కి కోస్తా జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుంది.. గతంలో ఈ జిల్లాలలోనూ స్వీప్ చేసిన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఉనికికోసం పోరాటం చేయడమే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాయలసీమలో కాస్త పట్టు నిలుపుకొని, ఉత్తరాంధ్రలోనూ భారీ సీట్లు దక్కించుకుంటే, కనీసం పార్టీ అస్తిత్వం నిలబడుతుందని జగన్ టీమ్ లెక్కలు కట్టిందట.. అందుకే, విజయనగరం జిల్లాలో రైల్వే యాక్సిడెంట్ జరిగిన వెంటనే జగన్ ఉరుకులు పరుగుల మీద హుటాహుటిన హెలికాప్టర్ ఎక్కారనే వాదన వినిపిస్తోంది..
గత నాలుగన్నరేళ్లుగా రాష్ర్టంలో ఎలాంటి ప్రమాదం సంభవించినా, చివరికి సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా వెంటనే స్పందించని జగన్.. తాజా రైల్ ప్రమాద బాధితులను పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలెస్ వదిలి పరుగులు పెట్టారు.. అయితే, ఇప్పటికే జగన్కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో ఈసారి సైకిల్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుందని పలు సర్వేలు సైతం చెబుతున్న మాట.. మరి, జగన్ దీనిని ఎలా నియంత్రిస్తారో, ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి..











