కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సంచలనంగా మారుతుంది లేదా చర్చనీయాంశమైనా అవుతుంది. చట్టాల రూపకల్పన కావచ్చు.. పథకాల అమలు కావచ్చు.. రాజకీయ పరమైన అంశం ఏదైనా కావచ్చు. అయితే ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గత ఆరేళ్లతో పోల్చితే కొంత భిన్నంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ నుంచి మొదలుపెడితే సన్నరకాలే పండించాలనే ఆదేశాల అమలు నిలిపివేత, ఎల్ఆర్ఎస్పై పునరాలోచన, తాజాగా పీఆర్సీ అమలు..ఇలా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..గతంలో తన నిర్ణయాలకు అడ్డుచెప్పేవారే లేరు అనే వైఖరి నుంచి ప్రస్తుతం అసంతృప్తిని తగ్గించే చర్యల వైపు అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు.
దుబ్బాక, GHMC పోస్టల్ బ్యాలెట్లు..
దుబ్బాక, జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ప్రమాద ఘంటికలు అనే సంకేతాలు వచ్చాయి. దీంతో పాటు కొత్త చట్టాలు, తమ పట్ల కొన్నాళ్లుగా కేసీఆర్ వైఖరితో ఇప్పటికే ప్రభుత్వోద్యోగుల్లో, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వోద్యోగులు ఎన్నాళ్లుగానే ఎదురుచూసున్న పీఆర్సీపై రెండు రోజుల్లో ప్రకటన రానుందని సమాచారం. డిసెంబరు 31తో ముగియనున్న పీఆర్సీ గడువును మరో మూడు నెలలు పొడగించడం,ఈ లోగా ఫిట్మెంట్పై ప్రకటన చేయడం ఖాయమని తెలుస్తోంది. ఆదివారం దీనిపై చర్చ జరిగినట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా కొత్త సంవత్సరంలోనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
2018 మేలో పీఆర్సీ ఏర్పాటు
వాస్తవానికి 2018 మేలో పీఆర్సీ ఏర్పాటైంది. 2018 మార్చిలో ఉద్యోగుల సభ, 53 సంఘాల జేఏసీల సభ తరువాత దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పీఆర్సీ గడువు పెంచుతూ నాలుగుసార్లు నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేసీఆర్ సర్కారుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్న సమాచారం రావడంతో ఆ ఫైలు ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల కోడ్ రాక ముందే దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 43శాతం ఫిట్మెంట్ ప్రకటించిన కేసీఆర్ తరువాత కొన్ని అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన వ్యక్తమయింది. రెవెన్యూ చట్టం, పురపాలక చట్టం, పంచాయతీరాజ్ చట్టం తదితర అంశాల్లో మార్పులతో పాటు ఆర్టీసీ సమ్మె సమయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన వైఖరి ఉద్యోగుల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇంకా ఆలస్యం చేస్తే.. ఇబ్బంది తప్పదనే కారణంతో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
సంఖ్య మారకపోవడంపై సందేహాలు..
కొన్నాళ్ల క్రితమే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ అంశం తెరపైకి వచ్చింది. గత నాలుగైదేళ్లుగా 50వేల ఉద్యోగాల భర్తీ అని చెబుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య మారలేదు. దీంతో సోషల్ మీడియాలోనూ ఈ ప్రకటనపై విమర్శలు వచ్చాయి. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన ఉద్యమం ద్వారా ఏర్పాటైన తెలంగాణలో..ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే అసంతృప్తి ఉంది. ఇదే కొనసాగితే అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు..ఇలా రానున్న ఎన్నికలకు తీవ్ర నష్టం కలగజేస్తుందన్న సంకేతాల నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.











