కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీపై మండిపడ్డారు. పదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నానని, తనకు MLC పదవి ఇస్తానని చెప్పుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ పదవి తీసుకుని ఉంటే ప్రజలు తనను రాళ్లతో కొట్టేవారన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
వైసీపీ పాలకులు చివరి రోజుల్లో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి కలవమన్నారని, మిథున్ రెడ్డిని కలిశాఖ ధనుంజయ రెడ్డి దగ్గరకు వెళ్తే జగన్కు సాష్టాంగ నమస్కారం చేయాలని చెప్పిన విషయాన్ని వాసంశెట్టి గుర్తు చేసుకున్నారు. మీ జిల్లాకు చెందిన మంత్రి వేణు ఇలానే చేస్తారని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులతో పాటు సొంత పార్టీ నేతలకు సైతం చుక్కలు చూపించారని గుర్తు చేసుకున్నారు.
జగన్ వ్యవహారశైలితో విసిగిన సొంత పార్టీ నేతలే ఓటుతో బుద్ధి చెప్పారన్నారు సుభాష్. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు నాడు ఎంపీగా ఉన్నప్పుడు జగన్ను సార్ అనలేదని, ఆయన ముందు కాళ్లపై కాళ్లు వేసుకుని దర్జాగా కూర్చున్నారని కారణాలతో రఘురామను ఇబ్బందులకు గురి చేశారన్నారు.
జగన్ బయటకు రాకుండా డార్క్రూమ్లో కూర్చొని నలుగురితో వ్యవస్థలను నడిపించారని, మళ్లీ తానే సీఎంను అవుతానని భావించారన్నారు. విశాఖలో పదవీ ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారన్నారు. ఫలితాలు తారుమారు కావడంతో ఏంచేయాలో తోచక కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బుడమేరు వరదల సమయంలో రూ.కోటి సాయం చేస్తానని చెప్పి ఇంతవరకు ఏమీ చేయలేదని.. చెల్లి ఆస్తుల విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రూ.కోట్లు సంపాదించినా జగన్కు సేవాగుణం లేదన్నారు.