ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం నమోదవుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఈ కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి విచారణలో కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది సిట్. మరోవైపు వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
విజయసాయిరెడ్డి ట్వీట్ ఇదే –
ఏపీ లిక్కర్ స్కామ్లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనన్నారు విజయసాయి. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారన్నారు విజయసాయి. తాను ఏ రూపాయిని ముట్టలేదన్నారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, పూర్తిగా విప్పేందుకు తాను సహకరిస్తానంటూ విజయసాయి చేసిన ఈ ట్వీట్తో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి. దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు అధికారులు విజయసాయిని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ పాలసీకి సంబంధించిన రెండు మీటింగ్లు తన హైదరాబాద్, తాడేపల్లి నివాసాల్లోనే జరిగాయని చెప్పారు విజయసాయి. ఈ సమావేశాలకు హాజరైన వారి విషయాలను సైతం విజయసాయి బయటపెట్టారు. సిట్కు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ రోజు ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డిని సైతం సిట్ విచారించింది. రాజ్ కేసిరెడ్డి తండ్రిని సైతం సిట్ పలుమార్లు విచారించింది. తాజాగా విజయసాయి చేసిన ట్వీట్ చూస్తే త్వరలోనే లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ హయాంలో మొత్తం నాలుగేళ్లలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి.