ఎవరు ఎవరికి సినిమా చూపిస్తున్నారో ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. ఏపీ సర్కారు వారు తీసుకునే మంచి నిర్ణయానికి మంచు కుటుంబాన్ని మాత్రం పిలవలేదు. అయినా మంచు కుటుంబం ఊరుకుంటుందా.. ఎంచక్కా మంత్రి నానికి ఎర్ర శాలువతో సత్కారం చేసి మురిసిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే మోహన్ బాబు ఇంటికి ఈరోజు మంత్రి పేర్ని నాని కదిలి రావడం. తనకు అవమానం జరిగింది కాబట్టి ఇంటికి రావల్సిందేనని మోహన్ బాబు పట్టుబట్టారేమోనన్న మాట కూడా వినిపిస్తోంది.
తెరవెనుక ఏం జరిగిందోగానీ మంత్రి నానికి మాత్రం మంచి సత్కారం జరిగింది. చిత్ర పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి మంచు కుటుంబం ఎంతో పొంగిపోయింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని మంచు వారబ్బాయి, మా అధ్యక్షుడు మంచు విష్ణు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎంతో మంచి నిర్ణయం తీసుకుందని మంచు మోహన్ బాబు, విష్ణువర్ధన్ బాబు అంటున్నారు. ఈ సత్కారం విషయాన్ని కాసేపు అలా పక్కన పెడితే అసలు నిన్న జరిగిన తంతే ఓ ప్రహసనంలా సాగింది. ఏదో గిల్లి జోల పాడిందనే సామెతను గుర్తుకు తెచ్చేలా ఈ మొత్తం వ్యవహారం ఉంది.
టిక్కెట్ల రేట్లు తగ్గించడం ఎందుకు? మళ్లీ పెంచడానికి ఎంత కాలయాపన చేయడం ఎందుకు? దీని కోసం సినీ పెద్దలంతా ఏదో సాధించేశారన్న బిల్డప్పు ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. జనానికి సినిమా చూపించే సినీజనానికి జగన్ సర్కారే సినిమా చూపించిందని జనం వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా నిన్న సీఎం జగన్ ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రాధేయ పడ్డట్టుగా వీడియోలు బయటికి రావడంతో ఆయన అభిమానులు కూడా చిన్న బుచ్చుకుంటున్నారు.
మెగాస్టార్ కాస్త సంయమనం పాటించి మాట్లాడి ఉంటే బాగుండేదని నెటిజన్లు కూడా అంటున్నారు. చిరంజీవి లాంటి మెగా హీరో అంతలా తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడటం ఏమిటి అంటున్నారు. ఇంకో పక్క నిన్న సీఎం సమక్షంలో పోసాని కృష్ణ మురళి మాట్లాడిన తీరు కూడా కొంత మంది కోపానికి కారణమైంది. ముందు మీరు రెమ్యూనరేషన్లు తగ్గించుకోండి అంటూ మాట్లాడటం విమర్శలకు తావిచ్చింది. సీఎం ఆగమన్న తర్వాత పోసాని వెనక్కి తగ్గాడని అంటున్నారు.