తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవంలో నారా లోకేష్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా బాలయ్య డైలాగులతో లోకేష్ క్యాడర్ ను ఉత్తేజపరిచారు. సమయం లేదు మిత్రమా అంటూ లోకేష్ ఓ డైలాగ్ అందుకోగానే కార్యకర్తలు కేరింతలతో ఊగిపోయారు. టిడిపి అన్స్టాపబుల్, ఎవరూ ఆపలేరు అనగానే పార్టీ శ్రేణులంతా లోకేష్ తో పాటు గొంతు కలిపారు. అదేసమయంలో వైసీపీని ఎదుర్కోవడానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు సమాయత్తం అవ్వాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, వారి కోసం పనిచేయాలని ఆయన కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలన్న లోకేష్, దూరమైన ప్రతి వర్గాన్నీ దరిజేర్చుకోనెలా క్షేత్ర స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.విభజన నాటి కంటే ఇప్పుడే రాష్ట్రానికి ఎక్కువ కష్టాలు ఉన్నాయని,వైసీపీ పాలనలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయిందని, అందుకే రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావడం లేదని తెలిపారు.ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న ఆయన, రానున్న రెండేళ్లలో రాష్ట్రానికి ఉన్న అప్పు 10 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటపడాలంటే టీడీపీని తిరిగి అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Must Read:-టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు