విశాఖ సిగలో సీ హారియర్ యుద్ధ విమానం త్వరలో సాగర తీరంలో కొలువు తీరనుంది. దీనిని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. గత ఏడాది గోవా నౌకాదళ కేంద్రం ఐఎన్ఎస్ హన్సా నుంచి విశాఖకు తీసుకువచ్చారు. అనంతరం TU-142 పక్కన ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒక వేదిక నిర్మించి, కొన్ని మరమ్మతులు చేసి రంగులు అద్ది ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టు కోసం విఎంఆర్డిఎ 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
సీ హారియర్ను ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తెచ్చేందుకు బీచ్ రోడ్లో ఉన్న రాజీవ్ స్మృతి భవనాన్ని వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ భవనం జివిఎంసి ఆధీనంలో ఉంది. ఇప్పటికే జీవీఎంసీ నుంచి వి ఎం ఆర్ డి ఏ స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రాతపూర్వక ప్రక్రియ పూర్తయింది. నేడో … రేపో.. ఈ భవనాన్ని అప్పగిస్తే, ప్రదర్శనశాలకు అవసరమైన పనులు ప్రారంభిస్తారు. ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పర్యాటకులకు కనువిందు..
విశాఖ సాగరతీరంలో ఇప్పటికే కురుసుర మ్యూజియం, TU-142 యుద్ధనౌక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీ హారియర్ కూడా అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మరింత కనువిందు కానుంది. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న పర్యాటక రంగానికి ఈ యుద్ధ విమానాలు తోడైతే వి ఎం ఆర్ డి ఏ కు ఆదాయం కూడా పెరుగుతుంది. సాగర తీరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా పెంచే పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.