వైఎస్ జగన్ హాయాంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం విద్యార్హతపై కొన్ని సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డిగ్రీ సర్టిఫికేట్ నకిలీ అంటూ సందేహాలు ఉన్నాయి. అయితే, ఈ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పై విచారణ జరపాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం కూన రవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉండగా.. చేసిన అక్రమాలను బయటికి లాగేలా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తున్నారు.
పలాసలో కూడా కూన రవి కుమార్ తమ్మినేని సీతారాం డిగ్రీ సర్టిఫికేట్ పైన విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఈ వ్యవహారంలో అడ్డంగా దొరకడం వల్లే కూన రవి దీనిపై పూర్తి విచారణకు పట్టుబడుతున్నారు. తమ్మినేని సీతారాం నిజానికి డిగ్రీ పాస్ కాలేదని అంటున్నారు. అయినా కూడా ఆయన హైదరాబాద్ ఓ లా కాలేజీలో ఆ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. ఈ మధ్యే స్పీకర్ గా పదవిలో ఉండగా.. లా కోర్సు చేద్దామని ప్రయత్నించారు.
అసలు తమ్మినేని సీతారాం లా కాలేజీలో ఎలా అడ్మిషన్ తీసుకున్నారని, ఆయన విద్యార్హతలు ఏంటని.. ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తెలుసుకున్నారు. అందులో ఆయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని తేలింది. ఆయన డిగ్రీ చదివానని చెప్పుకుంటున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించారు. అలా ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని ఆధారాలను కూడా సేకరించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. సాధారణంగా ఇలాంటివి బయట పడితే వెంటనే యూనివర్శిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి.
టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో ఫేక్ డిగ్రీని బయట పెట్టడంతో.. దాన్ని ఎవరు తయారు చేశారు.. ఎందుకు తయారు చేశారు.. ఇలా ఎన్ని చేశారన్నది ఆసక్తిగా మారింది. ఇది కనుక బయటికి వస్తే చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో తాను డిగ్రీ చదలేదని పెట్టుకున్నారు. మరి ఆయనకు డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అదీకాక దాన్ని పెట్టి లా కాలేజీలో పెట్టి అందులో అడ్మిషన్ పొందేందుకు ప్రయత్నించారు. దీంతో తన చేతులతో తానే తన సీక్రెట్ ను తమ్మినేని బయట పెట్టుకున్నట్లు అయింది.











