ఏపీకి కావాల్సింది సమర్ధ నాయకత్వమా ? కులాల కుంపట్లా ? జగన్ కొత్త క్యాబినెట్ లో జరిగిన సమీకరణాల్లో గొప్పతనమేముంది ? మంత్రులు ఎవరైనా నియంత్రణ సకల శాఖా మంత్రీదే అనే అపవాదు రానీయకుండా కాపాడుకుంటారా ? లేదా ఎవరేమనుకుంటే మాకేంటిలే అనే పంధానే కొనసాగిస్తారా ? ఉప సభాపతి ఎంపిక ప్రకటన పై జరుగుతున్న చర్చ ఏమిటి ?
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ కొత్త క్యాబినెట్ కూర్పు కుల సమీకరణాల దృష్ట్యా జరిగిందే తప్ప సమర్ధతకు పెద్దపీట వేయలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. సామాజిక భర్తీలు తప్ప సమీకరణాలు ఎక్కడా జరగలేదనేది చర్చ జోరుగా సాగుతోంది. దీంతో జగన్ 2.0 రాజకీయ లబ్ది కోణంలో తప్ప , రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా ఉపయోగపడేలా లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నెలకొంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒకవైపు రాజధాని లేని రాష్ట్రంగా పేరు గాంచితే, మరోవైపు వైసీపీ ప్రభుత్వ పోకడలతో మూడేళ్ళలో రాష్ట్రానికి పెట్టుబడులు ఏమీ రాని పరిస్థితి. ఇక కరోనా కబళింపుతో ప్రజల జీవితాలు ఛిద్రమయిపోయాయి. ఈ క్రమంలో రానున్న రెండేళ్ళు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించగలిగే ఒక సమర్ధ నాయకత్వం కావాల్సి ఉంది. అయితే కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ఆ సామర్ధ్యం ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన వారి సామర్ధ్యాలు ఏమిటనే చర్చ బహిరంగంగానే జరుగుతోంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి కృష్ణదాస్ స్థానంలో ధర్మాన ప్రసాదరావు, విడదల రజినికి క్యాబినెట్ లో స్థానం దక్కింది. యాదవ సామాజికవర్గానికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ స్థానంలో కారుమూరి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కన్నబాబు స్థానంలో దాడిశెట్టి రాజా, పేర్ని నాని స్థానంలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, కొట్టు సత్యనారాయణ నూతన మంత్రివర్గంలోకి వచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మేకతోటి సుచరిత స్థానంలో తిప్పే స్వామి క్యాబినెట్ లోకి రాగా, మెరుగు నాగార్జున కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కింది. అదేసమయంలో ఎస్టీ సమాజికవర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి స్థానంలో రాజన్నదొర కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చారు. అదేసమయంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్.కే. రోజా రెడ్డికి నూతన క్యాబినెట్ లో బెర్త్ లభించింది.
ఇదిలా ఉంటే పలు జిల్లాలకు కనీస ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక కొత్త క్యాబినెట్ కూర్పులో బ్రాహ్మణ, క్షత్రిక, వైశ్య , కమ్మ కులాలకు కనీసం అవకాశం కల్పించలేదు. దీనిపై భినాభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పై మంత్రి బాలినేని అనూచారుల దాడి అంశం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రాజేయగా , ఈ అంశం పై వైశ్య సామాజిక వర్గ పెద్దలు వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారనే ఆలోచనలో ఉన్నారని అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి క్యాబినెట్ లో స్థానం కల్పించలేదనే వాదన వినిపిస్తోంది. ఇక రఘురామ కృష్ణంరాజు అంశం కారణంగానే క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నూతన క్యాబినెట్ కొత్త సీసాలో పాత సారా గానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
మరోవైపు మంత్రుల నియంత్రణ పైనా అనేక విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి ఇప్పటికే చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మంత్రులు ఎవరైనా నిర్ణయం మాత్రం సకల శాఖా మంత్రీదే అనే రీతిలో పాలన కొనసాగుతున్న వైనం గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రుల పై నియంత్రణ పై ప్రభుత్వం అనేక విమర్శలనూ ఎదురకుంటోంది. కాగా ఈసారైనా ఆ అపవాదును బయటకు రానీయకుండా వైసీపీ ప్రభుత్వం కాపాడుకుంటుందా.. లేక ఎవరేమనుకుంటే మాకేంటిలే అని నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేలా వ్యవహరిస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉంటే అసలు వైసీపీ ప్రభుత్వానికి వ్యవస్థలపైన ఉన్న గౌరవం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప సభాపతిగా కోలగట్ల వీరభద్ర స్వామికి ఇస్తున్నాము అంటూ సజ్జల ప్రకటించడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఉప సభాపతి అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, శాశన సభ్యులచే ఎన్నుకోబడే స్థానం అది. దీనికి మొదట గవర్నర్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యి వచ్చాక ఈ ఎంపిక ప్రక్రియ అనేది మొదలవుతుంది. అయితే ఇప్పటికే కోన రఘుపతి శాశన సభ ఉప సభాపతిగా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఎక్కడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించలేదు, పైగా ఆ స్థానం అసలు ఖాళీ కాకుండా ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేస్తున్నాము అంటూ చట్ట సభలో సభ్యుడు కాని సజ్జల రామకృష్ణరెడ్డి ఎలా ప్రకటిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.డిప్యూటీ స్పీకర్ అనేది మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాదు, కానీ ఒక పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేయకుండానే మరొకరిని ఎంపిక చేస్తున్నట్లు ఎలా ప్రకటిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే సజ్జల చర్య ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన అని అసలు ఇదెక్కడి రాజ్యాంగ స్పూర్తి అనే వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.
మొత్తానికి జగన్ 2.0 కేవల రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసుకుందే తప్ప.. సామాజిక సమీకరణాలు అంటూ వైసీపీ చేసుకున్న ప్రచారంలోని ఏ అంశం కనిపించడం లేదనే భావన వ్యక్తమవుతోంది.











