రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ పార్టీ మీడియా టార్గెట్ చేసింది. నాణ్యత లేదంటూ కథనాలు వండి వార్చింది. ఐతే హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులపై వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంపై ఆ సంస్థ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హరియాణాలో తయారైన పెరుగులో వెన్న శాతం లేదంటూ సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ కేవలం రాజకీయ కక్షతో కూడిన దుష్ప్రచారమేనని హెరిటేజ్ క్లారిటీ ఇచ్చింది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే తమ సంస్థపై బురద జల్లడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించాలనే కుట్ర దాగి ఉందని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జె.సాంబమూర్తి మండిపడ్డారు.
నిజానికి, గతేడాది డిసెంబరులో జారీ అయిన ఓ నోటీసుపై హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది. గురుగ్రామ్లోని ఫుడ్ సేఫ్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఈ అంశంపై స్టే ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా, విచారణ పూర్తయ్యే వరకు జరిమానా చెల్లింపును కూడా నిలిపివేసింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని వక్రీకరిస్తూ, బ్లూ మీడియా కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తోందని, నమూనాల సేకరణలో జరిగిన లోపాలను కప్పిపుచ్చి తప్పుడు నివేదికలను వాడుకుంటున్నారని సంస్థ పేర్కొంది.
ల్యాబ్ నివేదికలను నిశితంగా పరిశీలిస్తే, అందులో SNF స్థాయి నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి వెన్న శాతాన్ని తగ్గించి లాభపడాలనే ఆలోచన సంస్థకు లేదని స్పష్టమవుతోంది. కేవలం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే హెరిటేజ్ వంటి ప్రతిష్ఠాత్మక బ్రాండ్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో, తమ అనుకూల పత్రికల్లో తప్పుడు ప్రచారానికి తెరలేపాయని సంస్థ ధ్వజమెత్తింది.
దశాబ్దాల చరిత్ర కలిగిన హెరిటేజ్ ఫుడ్స్, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందింది. పాలు, పాల ఉత్పత్తుల తయారీలో అత్యాధునిక సాంకేతికతను వాడుతూ, రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ సంస్థ ఎదిగింది. ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ స్వచ్ఛమైన ఉత్పత్తులను అందిస్తోందని, ఇలాంటి చిల్లర ప్రచారాల వల్ల సంస్థ బ్రాండ్ ఇమేజ్ చెక్కుచెదరదని హెరిటేజ్ యాజమాన్యం గర్వంగా ప్రకటించింది.











