గత కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం రూ.15 వేల కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని వరల్డ్ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకొస్తామని ప్రకటించారు. ఆ అవకాశం రావడంతో చంద్రబాబు సైతం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కలవడం, వారిని అమరావతి రప్పించడం కూడా జరుగుతోంది. అమరావతి రాజధాని పరిధిలో ఐకానిక్ కట్టడాలు, ఇతర నిర్మాణాలు, ప్రస్తుత స్థితిని క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్ బృందం పరిశీలించింది. తర్వాత అమరావతి కావాల్సిన రుణంపై చర్చలు కూడా జరిపారు.
2050 నాటికి అమరావతి నగరంలో 3.5 మిలియన్ ప్రజలు ఉంటారని అంచనా వేస్తున్నారు. అప్పటి అవసరాలను బట్టి, వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రాజెక్టులకు సాయం చేయాలని సీఆర్డీఏ బృందం ప్రపంచ బ్యాంక్ ముందు ప్రతిపాదనలు పెట్టింది. ముఖ్యంగా రోడ్లు, యుటిలిటీ కారిడార్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, కనెక్టివిటీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరద ముంపు నివారణ కాలువల మెరుగుదల చేసేందుకు నిధులు అవసరం అని సీఆర్డీఏ అధికారులు కోరారు.
అయితే, వీటి అన్నింటికి దాదాపుగా రూ.40 వేల కోట్ల అవసరం ఉంటుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రాథమికంగా అంచనా వేశారు. తాత్కాలికంగా రూ.15 వేల కోట్లు ఏర్పాటు చేస్తే వెంటనే పనులు మొదలుపెట్టేందుకు వీలుగా ఉంటుందని ప్రభుత్వ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రాయపూడిలో భవనాలు, హైకోర్టు పరిసరాలు, నిలిచిపోయిన నిర్మాణాలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందానికి చూపించారు. గతంలో పర్యావరణ ప్రభావం పర్యావరణ సామాజిక నిర్వహణ ఫ్రేమ్ వర్కులు కూడా అన్ని పూర్తయ్యాయని.. వాటిని కొనసాగించడమే తరువాయి అని చెపపారు.
ఇప్పుడు కొత్తగా అనుమతులు తీసుకోవడం లాంటివి ఏమీ ఉండదని అధికారులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు చెప్పారు. అయితే, ఆదివారం కూడా వారి పరిశీలన అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో జరగనుంది. ప్రపంచ బ్యాంక్ రుణానికి కేంద్రం గ్యారంటీగా ఉంటానని గతంలోనే ప్రకటించినందున రుణం వెంటనే మంజూరు అవుతుందని అంటున్నారు. పైగా చంద్రబాబు నాయకత్వంలో పాలన ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిన వారు.. జాప్యం చేయకుండా నిధులు విడుదల చేస్తారని భావిస్తున్నారు.











