rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న లీడర్షిప్ స్కిల్స్కు, వ్యాపార విస్తరణలో చూపిస్తున్న వ్యూహాత్మక చొరవకు ఈ గుర్తింపు దక్కింది.
హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి నారా బ్రాహ్మణి సంస్థను సరికొత్త పంథాలో ముందుకు నడిపిస్తున్నారు. సాంప్రదాయ డైరీ వ్యాపారానికే పరిమితం కాకుండా, మారుతున్న వినియోగదారుల అలవాట్లకు అనుగుణంగా వాల్యూ-యాడెడ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చి కంపెనీ బ్రాండ్ ఇమేజ్ను, రెవెన్యూను భారీగా పెంచారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో కార్పొరేట్ స్ట్రాటజీలను అమలు చేయడంలో ఆమె విజయవంతమయ్యారు.
పురుషాధిక్యత ఎక్కువగా ఉండే డైరీ, అగ్రి-బిజినెస్ రంగంలో మహిళగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నారా బ్రాహ్మణి సాధిస్తున్న విజయాలు కార్పొరేట్ రంగంలో సరికొత్త బెంచ్మార్క్లను క్రియేట్ చేస్తున్నాయి. వ్యాపార రంగంలో మహిళా సాధికారతకు, ఆధునిక కార్పొరేట్ నాయకత్వానికి ఆమె రోల్ మోడల్గా నిలుస్తున్నారు. సరిహద్దులను బద్దలు కొడుతూ ఆమె సాగిస్తున్న ఈ ప్రస్థానం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది వర్కింగ్ ఉమెన్కు, కాబోయే యువ మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో స్ఫూర్తినిస్తోంది.
కార్పొరేట్ రంగంలో బ్రాహ్మణి సాధించిన ఈ అరుదైన ఘనతపై అటు బిజినెస్ వర్గాల నుంచే కాకుండా ఇటు కుటుంబం నుండి కూడా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణి ఫార్చ్యూన్ ఇండియా ప్రతిష్టాత్మక జాబితాలో నిలవడం ఎంతో గర్వంగా ఉందని ఆమె భర్త, ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భార్య సాధించిన విజయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే నిరంతరం విజయవంతంగా లీడ్ చేస్తూ ముందుకు సాగాలి అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.










