ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ రంగ బంగారు గని, ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం చంద్రబాబు అధికారికంగా ఈ తొలి యూనిట్ను ప్రారంభించడంతో పాటు, రూ. 405 కోట్ల భారీ పెట్టుబడితో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా దాదాపు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టును నిర్మించాయి. ఈ మైనింగ్ హబ్ ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేయడమే కాకుండా, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సరికొత్త ఊతాన్ని ఇవ్వనుంది.
దాదాపు మూడు దశాబ్దాలుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు ఇక్కడ జరిపిన భూగర్భ పరిశోధనల అనంతరం వాణిజ్యపరంగా అత్యంత లాభదాయకమైన పసిడి నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. భూ ఉపరితలం నుంచి కిలోమీటరున్నర లోతు వరకు విస్తరించి ఉన్న ఈ గనుల్లో సుమారు 50 టన్నుల మేర భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు మైనింగ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఈ యూనిట్, ఇవాల్టి నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. అత్యంత పారదర్శకమైన, పర్యావరణహిత విధానాలతో ఓపెన్-పిట్ మైనింగ్, రిఫైనింగ్ ప్రక్రియ ఇక్కడ కొనసాగేలా అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను జోడించారు.
పక్కా ప్రణాళికతో సాగనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి ఏడాది 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, రెండో ప్లాంట్ అందుబాటులోకి వచ్చే నాటికి దానిని 900 కిలోలకు పెంచనున్నారు. ఆ తదుపరి దశల్లో వార్షికంగా రెండు టన్నుల మేర పసిడిని వెలికితీయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ ప్లాంట్ నిర్వహణకు కీలకమైన నీటి వనరుల కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం నుంచి 18 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్లైన్ను ఏర్పాటు చేయడం గమనార్హం. గతంలో మైనింగ్ లీజులు, అనుమతుల విషయంలో చోటుచేసుకున్న జాప్యానికి తెరదించుతూ, కూటమి ప్రభుత్వం పారిశ్రామిక సానుకూల విధానాలతో సింగిల్ విండో పద్ధతిలో మిగిలిన అనుమతులను వేగవంతం చేయడంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా కార్యరూపం దాల్చింది.
ఈ మెగా ప్రాజెక్ట్ అటు ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని, ఇటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధిని తెచ్చిపెట్టబోతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బంగారం విలువపై రాష్ట్ర ప్రభుత్వానికి 4 శాతం రాయల్టీ లభిస్తుంది. దీని ద్వారా తొలి ఏడాది రూ. 57 కోట్లు, ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పుడు ఏటా రూ. 144 కోట్ల పైచిలుకు కేవలం రాయల్టీ రూపంలోనే ప్రభుత్వానికి సమకూరనుంది. ఉద్యోగాల కల్పన విషయానికొస్తే.. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుండగా, అందులో 80 శాతానికి పైగా స్థానిక నిరుద్యోగ యువతకే అవకాశం కల్పించడం విశేషం. పరోక్షంగా మరో 1000 మందికి పైగా ఉపాధి లభించనుండటంతో తుగ్గలి పరిసర ప్రాంతాలు ఆర్థికంగా కీలక హబ్గా మారబోతున్నాయి.










