మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం గుర్తుచేసుకుందాం..
వెనకటికి ఒక కోతి ఉండేది. అసలే కోతి.. ఆపైన చాలా కోతివేషాలు వేస్తుండేది. ఆ కోతివేషాల్లో భాగంగా.. ఒకసారి దాని తోక ఒక ముళ్లకంపలో ఇరుక్కుపోయింది. ఇక చేసేదేముంది.. ఆ కంపతో సహా.. తోకను జాగ్రత్తగా పట్టుకుని మంగలి దగ్గరకు వెళ్లి.. తోకను కాపాడమని అడిగింది. ఆ మంగలి కత్తితో కంపను వేరుచేసే ప్రయత్నంలో.. ఏకంగా దాని తోక తెగిపోయింది. అతడితో గొడవపెట్టుకునేసరికి.. ‘బాబ్బాబూ గొడవ చేయొద్దు.. కావాలంటే నా కత్తి తీసుకువెళ్లు’ అన్నాడు. అది పుచ్చుకుని.. ‘తోకపాయె కత్తి వచ్చె టాం..టాం..టాం..’ అని పాడుకుంటూ తిరగసాగింది. దారమ్మట వెళుతున్న ఓ డోలు వాద్యగాడికి కత్తితో ఏదో అవసరమై కోతిని అడిగాడు. కత్తి ఇచ్చింది. అతడు పని చేసుకుంటుండగా కత్తి విరిగిపోయింది. కోతి గొడవ చేసేసరికి.. అతడు బతిమాలి కత్తికి బదులుగా తన డోలు ఇచ్చాడు. అప్పుడా కోతి..
తోకపాయె కత్తి వచ్చె టాం.. టాం..టాం..
కత్తిపాయె డోలు వచ్చె టాం..టాం..టాం..
అంటూ పాడుకుంటూ తిరగసాగింది. ఇలా అల్లుకుంటూ పోతే ఎంతపొడవైన కథైనా చెప్పుకోవచ్చు. ఆ కోతిలాగా ఎన్ని పాట్లు పడినా కూడా.. ఎన్ని పాటలు పాడినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం మళ్లీ అధికారం మాత్రం రాదు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డికి తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశ. నిజానికి ఏ నాయకుడికైనా అలాంటి కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకోవాలంటే.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలి. అభివృద్ధి పరంగా.. శాశ్వతంగా తన కీర్తి మిగిలిపోయే అద్భుత ప్రాజెక్టులు తీసుకురావాలి. ఫరెగ్జాంపుల్ హైదరాబాదులో ఇవాళ్టికి కూడా హైటెక్ సిటీ వాసులు, అక్కడి కంపెనీల ఉద్యోగులు చంద్రబాబునాయుడుకు నీరాజనాలు పడుతుంటారంటే కారణం అదే. హైటెక్ సిటీ అనేది చంద్రబాబునాయుడు దార్శనికతకు నిదర్శనం. ఆయన అద్భుతపాలనా పటిమకు ఒక రుజువు! ఇవాళ మాత్రమే కాదుకదా.. మరో వెయ్యేళ్లు గడిచినా కూడా హైటెక్ సిటీ యొక్క ఫలాలను అందుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా.. చంద్రబాబునాయుడును నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు.
చరిత్రలో నిలిచిపోవడం అంటే అలాంటి మంచి పనులు చేయాలి. కానీ.. కుట్రలు, కుత్సితాలు, కూహకాలు తప్ప మరొకటి తెలియని గొడ్డలి పార్టీ అధినేతకు అవేమీ తెలియదు. తన పేరు శాశ్వతంగా ఉండిపోవాలంటే.. ప్రజల ఆస్తులకు సంబంధించిన పాస్ బుక్కుల మీద తన పేరు, ఫోటో ముద్రించుకోవడమే ఆయనకు తెలిసిన విద్య. అన్నదాతలకు తరతరాలుగా సంక్రమించిన, చెమట చిందించి కొనుక్కున పొలాల్లో హద్దురాళ్లమీద తన బొమ్మ చెక్కించుకోవడం మాత్రమే ఆయనకు తెలుసు. అలాంటి అసహ్యకరమైన కీర్తికాంక్షతో కూడిన నాయకుడు గనుకనే.. ప్రజలు అత్యంత దారుణంగా ఛీత్కరించి.. ఆయనను కేవలం 11 సీట్లకు పరిమితం చేసి.. బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చోబెట్టారు.
ప్రజలు అంత ఘోరంగా ఛీత్కరించుకున్నా జగన్ బుద్ధి మాత్రం మారలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జగన్ బొమ్మల పిచ్చికి చరమగీతం పాడింది. పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వ రాజముద్రతో అందిస్తోంది. హద్దురాళ్లపై జగన్ బొమ్మలను తొలగించింది. రాళ్లమీద తన తలను తీసేసరికి జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. తన పేరు మాత్రం శాశ్వతంగా నిలుపుకోవాలని అనుకుంటున్నారు. మావిగన్ అనే అత్యంత అసంబద్ధమైన ప్రతిపాదన తీసుకువచ్చి.. అందులో తన పేరు చూసుకుని మురిసిపోతున్నారు. మావిగన్ పేరు వింటే.. చంద్రబాబుకు జగన్ గుర్తుకొచ్చి నిద్ర రాదేమో.. అని చీప్ కామెడీ చేస్తుండే జగన్ రెడ్డి.. మావిగన్ అనే చిత్రివిచిత్రమైన హాస్యాస్పదమైన పదాన్ని తలచుకుని.. అందులో తన పేరు ఉన్నదని మహా మురిసిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
మావిగన్ రాజధాని అయితే.. గెలిచిన తర్వాత.. అందులో తన పేరు శాశ్వతంగా మిగిలిపోతుందని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. కానీ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రజలు మరొకసారి తన మాయమాటలు నమ్మి మోసపోయేంత అమాయకులు కాదు అనే సంగతి ఆయన తెలుసుకోవడం లేదు.
రాళ్ల మీద బొమ్మలు వేసుకోవాలనే కుట్ర చేస్తే ప్రజలు ఛీత్కరించుకున్నారు. అద్భుతంగా తయారవుతున్న రాజధానిమీద ద్వేషంతో విషం కక్కుతూ.. ప్రత్యామ్నాయం పేరిట తన పేరు చూసుకునే ఉబలాటంతో మావిగన్ అంటోంటే.. జనం అంతకంటె ఘోరంగా అసహ్యించుకుంటున్నారు.
జగన్ మాత్రం.. ‘రాళ్లు పోయె పేర్లు వచ్చె టాం..టాం..టాం..’ అంటూ పైత్యపు పాటలు పాడుకుంటూ కాలం గడపాల్సిందే.











