రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. వచ్చే నెల జూలై 3వ తేదీన సీఎం చంద్రబాబు చేతులమీదుగా కడప ఉక్కు పరిశ్రమ పనులకు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. ఈసారి కేవలం పూజలకే పరిమితం కాకుండా, రాబోయే రెండేళ్ల కాలపరిమితిలోనే ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
నిజానికి, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన అనేది ఓ సీరియల్ను తలపిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా దాదాపు ఐదుగురు ముఖ్యమంత్రుల కాలంలో నాలుగు సార్లు కేవలం కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితమైన తీరు స్థానిక యువతకు తీవ్ర నిరాశను మిగిల్చింది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట వేల ఎకరాలు కేటాయించి తొలి శంకుస్థాపన చేసినా, ఆయన మరణానంతరం ఆ ప్రాజెక్టు అటకెక్కింది. విభజన తర్వాత కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాకపోయినా, రాయలసీమ ప్రయోజనాల కోసం 2018 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద రూ. 20,000 కోట్ల అంచనాతో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందంటూ రెండోసారి శంకుస్థాపన రాయి వేశారు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ఆ ప్రాజెక్టు మళ్లీ ఆగిపోయింది.
ముఖ్యంగా గత వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ సొంత జిల్లా అయిన కడపపై జరిగిన నిర్లక్ష్యానికి ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారమే నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గత సీఎం జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పనులను వేగవంతం చేయాల్సింది పోయి, మునుపటి స్థలాన్ని మార్చేసి 2019 డిసెంబర్లో సున్నపురాళ్లపల్లె వద్ద మూడోసారి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల ముందు రాజకీయం కోసం JSW గ్రూప్తో ఒప్పందం పేరుతో 2023 ఫిబ్రవరిలో నాలుగోసారి భూమి పూజ తంతు నడిపారు. ఇలా తన ఐదేళ్ల కాలంలో కేవలం 2 సార్లు శంకుస్థాపనలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు చూపించకుండా సొంత జిల్లా ప్రజలను, ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగ యువతను తీవ్ర భ్రమల్లో ముంచెత్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఈ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకడమే ధ్యేయంగా పూర్తి ఫోకస్ పెట్టింది. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమో, మాటలకో పరిమితం కాకుండా..JSW ఆధ్వర్యంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పనుల పురోగతిపై ఇటీవల ఉన్నతాధికారుల బృందంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి, లోపాలన్నింటినీ సరిదిద్దింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల 3న స్వయంగా పనులను ప్రారంభించి, రెండేళ్ల డెడ్లైన్తో ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం చూపుతున్న పారిశ్రామిక చిత్తశుద్ధి, ఫలితాలు చూపించాలనే పట్టుదల చూశాక..దశాబ్దాల కడప స్టీల్ ప్లాంట్ కల సాకారమై, తమ పిల్లలకు ఉద్యోగాలు దక్కుతాయనే బలమైన ఆశతో రాయలసీమ ప్రజలు ఉన్నారు.











