వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి సొమ్మునూ దోచేసిన దారుణ చరిత్ర అందరికీ తెలుసు. ఫ్యాన్ పార్టీ ఆనవాయితీని అనుసరిస్తూ.. శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే బాగోతం బయటపడింది. శ్రీశైలం భ్రమరాంబిక.. మల్లిఖార్జున స్వామి వార్ల సన్నిధిలో భక్తులు కాటేజీలు నిర్మించడానికి దేవస్థానం భూమి కేటాయిస్తుంది.
కాటేజీ నిర్మాణానికి అవసరమైన డబ్బులు విరాళంగా ఇచ్చిన వారికి.. సంవత్సరంలో కొన్ని రోజులు ఆ కాటేజీని వినియోగించుకొనే అవకాశం కల్పిస్తారు. జగన్ సర్కారు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి.. శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఒక కాటేజీని నిర్మించారు. 2023లోనే పనులు పూర్తి చేసి ప్రారంభించారు. వసతి గృహంలో.. గృహ ప్రవేశం చేసి మూడేళ్లయినా.. ఇంకా దేవస్థానానికి అప్పగించలేదు.
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి వసతి కోసం అవసరమైన రూములు, కాటేజీలు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. సామాన్య భక్తులు వసతి సౌకర్యం లభించక డార్మిటరీల్లో సర్దుకుపోతుంటే.. వైసీపీ ఎమ్మెల్యే మాత్రం మల్లన్న సన్నిధిలో నిర్మించిన కాటేజీని ఏడాది పొడవునా.. తన సొంత గెస్ట్ హౌస్లా వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. ఇప్పటికీ కాటేజీని దేవస్థానానికి అప్పగించకపోవడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి వైసీపీ ఎమ్మేల్యే రూల్స్ బ్రేక్ చేసి.. కాటేజీని పర్సనల్ గెస్ట్ హౌస్లా వాడుకొంటూ ఉంటే.. దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వసతి గృహాన్ని స్వాధీనం చేసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.











