ఏపీలో రేషన్ పంపిణీలో ఉపయోగిస్తున్న సాంకేతికత లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రేషన్ పంపిణీకి ఉపయోగిస్తున్న పీవోఎస్ యంత్రాలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. 7 సంవత్సరాల నుంచి ఈ యంత్రాలను రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ వేలి ముద్రలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక వేలి ముద్రతో రేషన్ పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేక రేషన్ డీలర్లు నానా తంటాలు పడుతున్నారు. 15వ విడత ఉచిత రేషన్ పంపిణీలో బియ్యం, శనగలు పంపిణీ చేస్తున్నారు. పీవోఎస్ యంత్రాలకు కొత్త సాఫ్ట్ వేర్ అప్లోడ్ చేయడంతో బియ్యానికి ఒకసారి, శనగలకు ఒక సారి వేలి ముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో గంటకు ఐదుగురికి మించి రేషన్ ఇవ్వలేకపోతున్నామని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు వేలి ముద్రలు ఎందుకు
ఒక వేలి ముద్రే సరిగా పడక నానా తంటాలుపడుతున్న రేషన్ డీలర్లు ప్రస్తుతం రెండు వేలి ముద్రలు తీసుకోవాల్సి వస్తోంది. తాజాగా ప్రభుత్వం పంపిణీ చేసే 15వ విడత రేషన్లో బియ్యం, శనగలు పంపిణీ చేస్తున్నారు. అధికారులు కొత్త సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మరింత సులువు కావాల్సిన డీలర్ల పని రెట్టింపు అయింది.
బియ్యానికి ఒకసారి, శనగలకు మరోసారి వేలి ముద్రలు తీసుకోవాల్సి వస్తోందని గుంటూరు, కృష్ణా జిల్లా డీలర్లు ఆందోళనకు దిగారు. రెండు వేలిముద్రలు అయితే రేషన్ ఇవ్వలేమని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేశారు.
డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తారా?
రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో వాలంటీర్ల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో రెండు మూడు మాసాల్లో వాలంటీర్లే రేషన్ డోర్ డెలివరీ చేయనున్నారు. అదే జరిగితే ఇక రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేషన్ డీలర్ల కమిషన్ కోసం ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. డీలర్ల వ్యవస్థను రద్దు చేయడం ద్వారా ఆదా అయ్యే నిధులను, బియ్యం డోర్ డెలివరీకి ఉపయోగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
మేళ్లు నేరుగా ఇంటికే…
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలతో పాటు, ఇప్పటికే అమలవుతున్న పలు సంక్షేమ పథకాలన్నీ డోర్ డెలివరీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టి సంకల్పంతో ఉన్నారు. నవరత్నాలు అన్నీ నగదు బదిలీ పథకాలే కాబట్టి లబ్దిదారులు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇక రేషన్ కూడా ఇంటి వద్దకే సరఫరా చేస్తే, ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారంలోకి రాగానే రేషన్ డోర్ టు డోర్ సరఫరా చేయాలని నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో కొన్ని అవాంతరాలు వచ్చాయి. వాలంటీర్లకు వాహనాలు సమకూర్చి ఆ తరవాత బియ్యం డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు బియ్యం తరలించేందుకు ఉపయోగించనున్న వాహనాల డిజైన్ లను సిద్దం చేశారు. త్వరలో ఆ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాలు సిద్దమయితే ఇక రేషన్ డీలర్ల వ్యవస్థ రద్దయి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.











