విజయవాడ దుర్గ గుడి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. నవరాత్రుల్లో ఐదవ రోజున కొండ చరియలు విరిగిపడ్డాయి. అదే రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆలయాభివృద్ధికి రూ.70 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది.
ఇదో చారిత్రాత్మక అంశం: దుర్గ గుడి ఛైర్మన్
కొండ చరియలు విరిగి పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించడం పై స్పందించిన దుర్గ గుడి ఛైర్మన్ పైలా సోమి నాయుడు ముఖ్యమంత్రి జగన్ గారూ గుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్ల నిధులు కేటాయించడం చారిత్రాత్మక అంశమని తెలపడం కాస్త వివాదాలకు దారి తీసింది.
ఈ విషయం పై స్పందించిన కొందరు భక్తులు, ప్రముఖులు కేవలం బండలు పడితేనే ముఖ్యమంత్రి గారు ఆలయాభివృద్ధికి నిధులు కేటాయిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని చారిత్రాత్మక అంశం అంటూ చెప్పడం అనేది దుర్గ గుడి ఛైర్మన్ స్వామి భక్తిని చాటుకున్నట్లే అంటూ విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రి తన సొంత డబ్బులు ఏమి కూడా గుడి కోసం ఇవ్వలేదు. అవి ప్రభుత్వం నుంచి వచ్చినవి. ఇంత మాత్రనికే ఇదో చారిత్రాత్మక అంశం అంటూ పేర్కొనడం సరైనది కాదు అంటూ దుర్గ గుడి ఛైర్మన్ కు చురకలు అంటిస్తున్నారు.
టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ రాలేదు
శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆన్ లైన్ ద్వారా దాదాపు 85 వేల మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ దాదాపు 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారని ఛైర్మన్ తెలిపారు. నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్ బుకింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా దాదాపు అమ్మవారిని 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానానికి రూ. 4.36 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
మీ పిచ్చి నిబంధనల వల్లే భక్తులు రాలేదు
అయితే ఆలయాధికారులు విధించిన పిచ్చి నిబంధనలు ప్రజలకు అర్థం కాకపోవడం వలనే చాలా మంది భక్తులు దర్శనానికి రాలేకపోయారని కొందరు భక్తులు పేర్కొన్నారు. ఆలయాధికారులు సామాన్య భక్తులకు ఉచిత దర్శనాన్ని రద్దు చేయడంతో చాలా మంది భక్తులు ఈ సారి అమ్మవారిని దర్శించుకోలేదని తెలిపారు.
ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం: ఈవో సురేశ్ బాబు
భక్తుల సౌకర్యాలు, రక్షణ చర్యలకు ఏ విధమైన లోటు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపారు. ఆన్ లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవానీ దీక్షా విరమణకు వచ్చే భక్తులు విధిగా ఆన్ లైన్ టిక్కెట్లు తీసుకోవాలని ఆయన తెలిపారు.











