ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్నారు.. ఈ ఏడాదికి ఇండియాకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కే 25 శాతం దక్కాయి. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు అమరావతి నుంచి అనంతపురం వరకు రాష్ట్రం నలుమూలలా.. భారీ పరిశ్రమలు వస్తున్నాయి. వీటి ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల మందికిపైగా యువత చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి వాళ్లంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస పోవాల్సి వచ్చేది. కానీ మొదటిసారి ఏపీకి రివర్స్ మైగ్రేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న భారీ పరిశ్రమలతో ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం మన దగ్గరకు వలస వచ్చే పరిస్థితులు తీసుకొస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల్లో ఎక్కువ శాతం అనకాపల్లి జిల్లాలోనే ఏర్పాటయ్యాయి. అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లా చేస్తామన్నారు.
ఒక దేశం లేదా రాష్ట్రం డెవలప్ అయిందా లేదా అని చెప్పడానికి.. అక్కడి మైగ్రేషన్ ట్రెండ్స్ బాగా ఉపయోగపడతాయి. అవకాశాలు లేని రాష్ట్రాల నుంచి డెవలప్ అవుతున్న రాష్ట్రాలకు వలసలు ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి నగరాలకు ఉద్యోగాలు, ఉపాధి కోసం ప్రతి ఏటా లక్షల మంది వలస వస్తూ ఉంటారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షల మంది యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతుంటారు. ఏపీని.. బీహార్ వంటి రాష్ట్రాలతో పోల్చడం దారుణంగా అనిపించినా.. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న కాదనలేని వాస్తవం.
కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్.. బీపీసీఎల్ రిఫైనరీ, రామాయపట్నం పోర్టు వంటి భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. అమరావతిలో రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకో ఏడాదిలో పోలవరం పూర్తవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సోలార్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అనుకున్న సమయం కంటే ముందే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పక్కా ప్లానింగ్తో, ఎంతో ముందు చూపుతో, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడమే కాకుండా వాటిని సాధించి చూపించడం వల్లనే ఏపీ సీఎం చంద్రబాబు విజనరీ అనిపించుకొన్నారు. ఒక్క ఐటీ రంగం, ఒక్క హైటెక్ సిటీ, ఒక్క సైబరాబాద్తోనే తెలంగాణలో అంత అభివృద్ధి జరిగితే.. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రధాన కేంద్రాలుగా.. ఐటీ, స్టీల్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక రంగాలతో ఏపీలో డెవలప్మెంట్ నెక్ట్స్ లెవెల్లో ఉండటం ఖాయం.











