వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన, విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ నెల 24,25 తేదీల్లో కోర్టులో అభియోగాలు నమోదు చేయాల్సి ఉండగా, సాక్షులు తనపై వ్యతిరేక సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు భారీగా డబ్బు ఎర వేయడమే కాకుండా, మాట వినకపోతే చంపేస్తామంటూ తన అనుచరుల ద్వారా బెదిరింపులకు దిగారు.
కాకినాడ JNTU సమీపంలోని సమీరా అపార్ట్మెంట్స్లో సాక్షులను నిర్బంధించి బేరసారాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క సాక్షికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని, ప్రస్తుతానికి రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకోవాలని బలవంతం చేశారు. డిఫెన్స్ లాయర్లు ఏం చెబితే అది చేయండి.. పాత వాంగ్మూలాలతో పనిలేదు.. మేము పైస్థాయి వరకు అందరినీ మేనేజ్ చేశామంటూ అనంతబాబు అనుచరులు సాక్షులపై ఒత్తిడి తెచ్చారు. ఫోన్లు స్విచాఫ్ చేసి, నిర్బంధించి సాగించిన ఈ గూడుపుఠాణీపై సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్ ఫిర్యాదు చేయడంతో పోలీసుల తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంలో పోలీసులు అనంతబాబుతో పాటు ఆయన ప్రధాన అనుచరులైన కడియాల చినబాబు, కడియాల సతీష్, మాగంటి రాంబాబులపై సెక్షన్ 61(2)(A), 351(2), 232(1), 127(2), 3(5) BNS కింద కేసులు నమోదు చేశారు. కీలక పాత్రధారి మాగంటి రాంబాబును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన తప్పించుకున్నారు. ఎమ్మెల్సీ కారు, గన్మెన్ అక్కడే ఉన్నప్పటికీ, పోలీసులు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఆయన బైక్పై పరారవ్వడం చర్చనీయాంశమైంది
మరోవైపు, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించిన నేపథ్యంలో, అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ బాధితులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. హ*త్య కేసులో శిక్ష పడకుండా ఉండేందుకు సాక్షులకు ప్రాణహాని కలిగించే స్థాయికి ఎమ్మెల్సీ వెళ్లడం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.











