తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత కొన్నాళ్లుగా పార్టీలో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని, సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భర్తీ చేస్తున్నారని సాగిన ప్రచారానికి తన స్టైల్లో ఫుల్స్టాప్ పెట్టారు సజ్జల. ఈసారి అక్షరాలా 600 కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఆరోపణను అస్త్రంగా మలుచుకుని చెవిరెడ్డిని డిఫెన్స్లోకి నెట్టేశారు.
లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో జగన్ దృష్టికి రాకుండా దాదాపు రూ. 600 కోట్ల రూపాయల మేర లోపాయికారీ లావాదేవీలు జరిగాయని, దీని వెనుక చెవిరెడ్డి హస్తం ఉందనేది సజ్జల వర్గం ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి చిట్టాను, లెక్కలను సజ్జల నేరుగా అధినేత జగన్ ముందు ఉంచినట్లు సమాచారం. మనకు తెలియకుండానే ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయా..? అని జగన్ విస్తుపోయేలా ఈ విషయాన్ని ప్రజెంట్ చేయడంలో సజ్జల సక్సెస్ అయినట్లు సమాచారం.
ఈ పరిణామాల తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. పార్టీలో నెంబర్-2 స్థానం కోసం ప్రయత్నిస్తున్న చెవిరెడ్డిపై జగన్ ఒకింత అసహనానికి గురయ్యారని, అందుకే ఆయనను దూరం పెట్టి మళ్లీ కీలక బాధ్యతలను సజ్జలకే అప్పగిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన ఆధిపత్యానికి ఎవరైనా అడ్డువస్తున్నారని భావిస్తే, వారి బలహీనతలను అధినేత ముందు పెట్టి సైడ్ చేయడంలో సజ్జల మరోసారి సక్సెస్ అయ్యారనే ముద్ర పడిపోయింది.
గతంలో పార్టీలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి లాంటి ఉద్దండులే సజ్జల ఎత్తుగడలకు తలవొంచి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సాయిరెడ్డికే తప్పని పరిస్థితి ఇప్పుడు చెవిరెడ్డికి కూడా ఎదురైందని, 600 కోట్ల లిక్కర్ లెక్కలు తేలే వరకు ఆయనకు ప్యాలెస్లోకి ప్రవేశం కూడా కష్టమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. సజ్జల వ్యూహంతో చెవిరెడ్డికి ఇప్పుడు సొంత పార్టీలోనే ఏకాకి అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం వైసీపీలో మళ్లీ సజ్జల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ పరంగా ప్రతి కీలక నిర్ణయంలోనూ ఆయన సంతకం కనిపిస్తుండగా, చెవిరెడ్డి మాత్రం పూర్తిగా మౌనంలోకి వెళ్లిపోయారు.











