ఉత్తరాఖండ్ మరోసారి ప్రాకృతిక విలయానికి బలైంది. తీవ్రమైన ప్రకృతి ప్రకోపాన్ని చవి చూసింది. ఆ రాష్ట్రానికే ఎందుకిలా జరుగుతోంది. సీజన్లతో సంబంధం లేకుండా ఈ వరదలు రావడం ఏంటి? ఈ జల విలయాలకు తోడు అప్పుడప్పుడూ భారీ భూ విలయాలు. ఎందుకిలా జరుగుతోంది? పరమ పవిత్రమైన బద్రీనాథ్, కేదారీనాథ్ ఆలయాలతో.. భూలోక కైలాసంగా వినుతికెక్కిన ఆ ప్రాంతంపై ప్రకృతి పగబట్టిందా? లేదా.. మానవ తప్పిదాలతో విసుగెత్తిన ఆ గరళ కంఠుడే తన అర్ధాంగి గంగను పంపి శిక్షిస్తున్నాడా! అసలు ఎక్కడ జరుగుతోంది తప్పిదం!
అంతా క్షణాల్లో జరిగిపోయింది..
‘దుమ్ము, ధూళి, మట్టి, నీరు.. అన్నీ కలిసి క్షణాల్లోనే.. చూస్తూ ఉండగానే ఓ మహా ఉప్పెనలా వచ్చి పడ్డాయి. చాలా వేగంగా.. ఎంత వేగంగా అంటే.. ఎవరినీ హెచ్చరించే సమయం కూడా లేకపోయింది. ఆ ఉధృతికి మేం కూడా కొట్టుకుపోతామనే అనుకున్నాం’ ఇవి.. సంజయ్ సింగ్ అనే వరద బాధిత ప్రాంతవాసి చెప్పిన మాటలు. ఈ మాటలు విన్న వారికి వెన్నులో వణుకు పుడుతుంది. జల ప్రళయం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది.
ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడే అర్థమవుతుంది.. ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడో అని..! గంగా ప్రవాహానికి అడ్డుకట్ట వేశానని, అదుపు చేయగలిగానని విర్రవీగుతున్న మనిషికి.. అదే గంగ.. ఉగ్రరూపం దాల్చితే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది. ఆధునిక సాంకేతికతను మేళవించి నిర్మించిన భారీ నిర్మాణాలను ఉగ్రజలం తునాతునకులు చేసేసింది. ఓ భారీ విద్యుత్తు ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేసింది. అడ్డొచ్చిన అన్నింటినీ తనలో కలిపేసుకుంది.

ఎన్నో ప్రళయాలు..
ఉత్తరాఖండ్కు ఇలాంటి ప్రళయాలు కొత్తకాదు. గతంలోనూ ఎన్నో వచ్చాయి. వేలాది మందిని బలిగొన్నాయి. అయినా.. మనిషి మారలేదు. ప్రభుత్వాలు చలించలేదు. తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. విపత్తులు సంభవించినప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత మిన్నకుండిపోవడం.. ఇది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు.
- 1991లో ఉత్తర కాశీలో వచ్చిన భూకంపం దాటికి 708 మంది చనిపోగా.. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ భూకంపం తీవ్రత.. రిక్టర్ స్కేలుపై 8గా నమోదైంది.
- ఆ తర్వాత 1998లో కొండచరియలు విరిగిపడి.. ఏకంగా ఓ గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఆ విరిగిపడడం కూడా అలా ఇలా కాదు.. శారదా నది ప్రవాహమే ఆగిపోయేంతలా..! ఈ ఘోర దుర్ఘటనలో 255 మంది మరణించారు. వీరిలో.. కైలాస్ మానస సరోవరం యాత్రికులు కూడా ఉన్నారు. ఇది జరిగి ఏడాది తిరక్కుండానే మరో విలయం ఉత్తరాఖండ్ను వణికిందిచింది.
- 1999లో 8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ భూ విలయం దాటికి ఎక్కడో రుద్రప్రయాగలో కొండచరియలు విరిగిపడి రోడ్లు బీటలు వారాయి.
- ఇక 2013లో సంభవించిన జల విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతితీవ్ర వర్షం దాటికి వరద ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ విపత్తు.. దాదాపు 5,700 మందిని బలితీసుకుంది. వంతెనలు, రోడ్లే కాదు.. ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. చార్ ధామ్ యాత్రా మార్గం అష్టదిగ్బంధమై పోయింది. ఎక్కడికక్కడ మూడు లక్షల మందికి పైగా భక్తులు చిక్కుబడిపోయారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద జలప్రళయంగా నిలిచిపోయింది.

గ్లేషియర్ బరస్ట్ వల్లే..!
మూడు దశాబ్దాలుగా ఇన్ని ప్రళయాలు సంభవిస్తున్నా.. కారణం ఇది అని చెప్పలేని స్థితిలోనే ఉన్నాం ఇంకా. పర్యావరణ మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇందుకు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నందాదేవి పర్వతంపై జరిగిన ‘గ్లేషియర్ బరస్ట్’ వల్లే వరద పోటెత్తిందని నిపుణులు చెబుతున్నారు. మంచు పర్వతాలపై ఉండే హిమనీ నదాలనే గ్లేషియర్స్ అంటారు. ఈ హిమనీనదాల లోపలిభాగాల్లో నీరు ప్రవహిస్తుంటుందని, ఆ నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆ మంచుగడ్డలు ఒక్కసారిగా పేలుతాయని, దాన్నే గ్లేషియర్ బరస్ట్ అంటారని వారు అంటున్నారు. అలా జరిగినప్పుడు.. అందులోని నీరు విపరీతమైన వేగంతో.. ముందుకు ఉరుకుతుంది. అదే.. ప్రస్తుత విలయానికి కారణమైంది.
అసలు నీరు ఎందుకు కరుగుతుంది?
పర్యావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల హిమనీనదాల్లోని నీరు వేగంగా కరిగిపోతోంది. హిమాలయాల్లోని మంచు నదులకు ఈ తరహా ముప్పు పొంచి ఉందని ఏడాది క్రితమే ఓ అధ్యయనానికి సంబంధించిన నివేదిక వెలువడింది. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగితే.. 2100 నాటికి హిందూకుష్ హిమాలయన్ ప్రాంతం మూడో వంతు కరిగిపోతుందని ఆ నివేదిక హెచ్చరించింది. ఇదే జరిగితే.. మానవాళికి పెనుముప్పు తప్పదు. కానీ.. ప్రభుత్వం ఈ నివేదికను పట్టించుకున్న పాపాన పోలేదు.

శ్రుతిమించుతున్న మానవ జోక్యమూ కారణమేనా?
సున్నితమైన హిమాలయా ప్రాంతంలో జనసంచారం పెరగడమూ ఇలాంటి విపత్తులకు కారణమవుతోంది. ఉత్తరాఖండ్ లో ట్యాక్సులు తక్కువగా ఉండడం, రాయితీలు ఎక్కువగా లభిస్తుండడం వల్ల.. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు. విద్యుత్, ఫార్మసీ పరిశ్రమలు ఈ రాష్ట్రంలో అధికం. వీటి నిర్మాణాల్లో నిబంధనలను పాటించకపోవడం కూడా ప్రధానంగా ఇక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడానికి కారణమవుతోంది. ఈ ప్రాంతాల్లో ఎలాపడితే అలా భారీ నిర్మాణాలు చేపట్టకూడదు. నిర్మాణాలకు చెక్క, రాతిని మాత్రమే వినియోగించాలి. కానీ, ఇప్పుడు ఈ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నారు. కాంక్రీట్ వల్ల భూతాపం పెరిగి విపత్తులు సంభవిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నివేదిక ఇచ్చిన ఉమా భారతి..
కేంద్ర మాజీ జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి.. దీనిపై కేంద్రానికి ఎప్పుడో నివేదిక ఇచ్చారు. గంగ, దాని ఉప నదులపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి తాను వ్యతిరేకమని చెప్పారు. అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. నాడు ఆమె మాటలను ఓ ఆస్తికురాలైన హిందూ సన్యాసిని మాటలుగానే తీసుకున్నారు తప్ప.. అందులోని వాస్తవికతను గుర్తించలేకపోయారు. ప్రభుత్వం ఇకనైనా ఈ విపత్తులపై దృష్టి పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనక పోతే.. ఇప్పటివరకు దేశాన్ని కాపాడుతున్న హిమాలయాలే వినాశనానికి మూలం కావడం తథ్యం.











