నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్కు నిరాశే మిగిలింది. తెలుగు, తమిళ మత్స్యకారుల మధ్య జరుగుతున్న గొడవలను రాజకీయం చేద్దామనుకొంటే.. ఎవరూ పట్టించుకోలేదు. జగన్ సభకి వెళ్లడానికి మత్స్యకారులు ఆసక్తి చూపించలేదు. ఇద్దరు జాలర్లతో మొక్కుబడిగా మాట్లాడి వెనక్కి వెళ్లవలసి వచ్చింది. స్థానికుల నుంచి రెస్పాన్స్ లేకపోవడం.. సభకు అనుకున్నంత మంది జనం రాకపోవడంపై జగన్ అసహనం వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటలా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఇంత దిగజారిపోవడం ఒకరకంగా జగన్ను భయపెట్టిందని చెప్పుకోవచ్చు.
కొన్ని రోజుల క్రితమే జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ కంపెనీ వల్ల హార్బర్ మత్స్యకారులకు దక్కదని వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఈ అంశం ద్వారా అక్కడి మత్స్యకారుల్లో ఫేమస్ అవ్వాలని జగన్ ప్లాన్ చేశారు. తీరా అక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది. అల్లూరు మండలం పట్టపుపాలెం మత్స్యకారులైతే.. జగన్ సభకు వెళ్తే లక్ష రూపాయలు దురాయి చెల్లించాలని హెచ్చరించారు. దురాయి అంటే జరిమానా. ఇతర మత్స్యకార గ్రామాల్లోనూ జగన్ సభకు వెళ్లకూడదని పెద్దలు కట్టుబాటు విధించారు.
జగన్ సభకు మత్స్యకారుల నుంచి స్పందన లేకపోవడంతో.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఇతర వైసీపీ నాయకులు.. జనసమీకరణకు వేరే ప్లాన్లు వేసుకోవాల్సి వచ్చింది. కావలి నియోజకవర్గంతో పాటు సర్వేపల్లి, కోవూరు, ఉదయగిరి, కందుకూరు, నెల్లూరు సిటీ నుంచి జనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. బస్సులు, ఆటోలు ఏర్పాటు చేసి బిర్యానీ పెడతామన్నా మండే ఎండల్లో జగన్ ప్రసంగం వినడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హర్బర్ సమీపంలోని మత్స్యకార గ్రామాల్లో జగన్ మీద వ్యతిరేకతకు చాలా కారణాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రకాశం జిల్లా వాడరేవు పోర్టు వరకు మధ్యలో ఎక్కడా హర్బర్లు గానీ, జెట్టీలు గానీ నిర్మించకూడదని జీవో ఇచ్చారు. దాని వల్ల గత రెండు దశాబ్దాల్లో ఇక్కడ చేపల రేవు నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. ఈ జీవోని మార్పించి.. అన్ని అనుమతులు తీసుకొచ్చి 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం ప్రారంభించింది. తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. పనులు పూర్తి చేయలేదు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం హార్బర్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో జగన్ హడావుడి చేయడం మత్స్యకారులను కదిలించలేకపోయింది. అందుకే జువ్వలదిన్నెలో వైసీపీ సభ తుస్సుమంది.











