ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోను భారీ చారిత్రక చిత్రాలు రూపొందుతున్నాయి. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్ తో .. భారీతారాగణంతో ఈ సినిమాను ఆయన తీర్చిదిద్దుతున్నారు. ఐశ్వర్యరాయ్ విలన్ పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ .. జయం రవి .. మోహన్ బాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కోవిడ్ కి ముందు ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు థాయ్ లాండ్ లో జరిగింది. 90 రోజుల పాటు అక్కడ జరిగిన షూటింగులో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
ఆ తరువాత కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు, ఇటీవలే మొదలైంది. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన భారీ సెట్లో ప్రధాన పాత్రల కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను కూడా తీసుకున్నారనేది తాజా సమాచారం. ఆయన కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. “మణిరత్నం దర్శకత్వంలో ‘ఇరువర్’ (ఇద్దరు) చేసి పాతికేళ్లు దాటింది. మళ్లీ ఇంతకాలానికి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించింది .. ఏదో తెలియని ఆనందంగా ఉంది” అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఇది రాజరాజచోళులకు సంబంధించిన కథ. రాజరాజచోళులలో ఒకరైన పొన్నియిన్ సెల్వన్ గురించి ‘కల్కి’ కృష్ణమూర్తి రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అందువలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఇక ఇందులో విలన్ ఐశ్వర్య రాయ్ అనేసరికి అందరిలో మరింత కుతూహలం పెరిగిపోయింది. అప్పటి రాజరిక వ్యవస్థ .. సామాజిక పరిస్థితులు .. రాజుల స్వభావాలు .. అంతఃపుర రహస్యాలు ఇలా అనేకం ఈ సినిమాలో చూపించనున్నారు. తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తూ ఉండటం విశేషం.
On the sets of #Maniratnam s #PonniyinSelvan .. a journey with the master ..which started 25 years back from #iruvar continues… the joy of unlearning… finding new horizons… bliss n blessed
— Prakash Raj (@prakashraaj) January 14, 2021