(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సంతబొమ్మాళి శివాలయంలోని నందేశ్వరుని విగ్రహం శుక్రవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, కొంతదూరం తీసుకుపోయి .. ఆరుబయట వదిలిపెట్టారు. శనివారం ఉదయం ఆలయ పూజారులు యథావిధిగా అర్చనలు చేసేందుకు ఆలయం తలుపులు తెరవగా నందేశ్వరుని విగ్రహం కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పరిసర ప్రాంతాల్లో వెతికితే కొంత దూరంలో ఆరుబయట నందేశ్వరుని విగ్రహం కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. 110 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయంలో దుండగులు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడటంతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి…
ఈ విషయం తెలుసుకున్న టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వెళ్లడంతో .. వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ ఆ గ్రామాన్ని సందర్శించి .. ఆ గ్రామస్తులతో మాట్లాడి .. పరిస్థితిని సమీక్షించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆరోపించారు.
ఈ సంఘటనకు బాధ్యులను తక్షణమే పట్టుకుని .. కఠినంగా శిక్ష పడేలా చర్యలు చేపట్టమని పోలీసులకు కోరనున్నట్లు ఆ గ్రామస్తులతో శ్రీనివాస్ తెలిపారు.