ఏపీలో కూటమి సర్కార్ ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగెత్తిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. జులై నుంచి కొత్తం పింఛన్ల మంజూరుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొత్త పింఛన్లకు నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చినా నాడు పింఛన్లు ఇవ్వలేదు. వైసీపీ నేతల సిఫారసులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు. ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
వైసీపీ హయాంలో బోగస్ సర్టిఫికేట్లు
వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధ్రువీకరణ పత్రాలు ఇబ్బడిముబ్బడిగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి రూ.30 వేల వరకు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీ-అసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది.
89 వేల మందికి వితంతు పింఛన్లు
కుటుంబంలో పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా వితంతు పింఛను అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబరు 1 నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛను మంజూరు చేయాలని నిర్ణయించింది. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛను అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 అర్హులుంటారని భావిస్తున్నారు.