రాజధాని అమరావతిలో పలు కీలక సంస్థలకు భూములు కేటాయించింది కూటమి సర్కార్. ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్ ఏర్పాటుకు ఎకరం రూ.50 లక్షల చొప్పున 70 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో ఈ భూమిని కేటాయించింది. రాజధానిలో వివిధ సంస్థలకు కొత్తగా భూ కేటాయింపులు, కొన్ని సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ESI కార్పొరేషన్కు ఎకరం రూ.50 లక్షలు చొప్పున నెక్కల్లులో 25 ఎకరాలు ఇచ్చారు. హడ్కో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఎకరం భూమి రూ.4 కోట్లు చొప్పున 8 ఎకరాలు కేటాయించింది. భారతీయ రిజర్వు బ్యాంకుకు నేలపాడు వద్ద గతంలో ఎకరం రూ.4 కోట్లు చొప్పున 2 ఎకరాలు కేటాయించగా, దాన్ని ఇప్పుడు 3 ఎకరాలకు పెంచింది.
వీటితో పాటు లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు అదనంగా 6 ఎకరాలు, IRCTC హోటల్కు ఎకరం, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి 0.78, కోస్టల్ బ్యాంక్కు 0.40 ఎకరాలు చొప్పున కేటాయించింది. LIC, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG), సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీ, GSI, రామకృష్ణ మిషన్లకు గతంలో మొత్తం 23.805 ఎకరాలు కేటాయించగా..దాన్ని ఇప్పుడు 8.85 ఎకరాలకు తగ్గించింది. కాగ్కు గతంలో 14.05 ఎకరాలు కేటాయించగా, దాన్ని 2.05 ఎకరాలకు తగ్గించింది.
2014-19 మధ్య 22 సంస్థలకు చేసిన 99.61 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేసింది. రాజధానిలో హోటళ్ల ఏర్పాటుకు గతంలో ‘వరుణ్ హాస్పిటాలిటీ అండ్ ఇట్స్ కన్సార్షియం’తో CRDA చేసుకున్న భూ విక్రయ ఒప్పందాన్ని మార్పుచేసి వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఓం శ్రీ భావనసాయి అసోసియేట్స్తో గతంలో చేసుకున్న ఒప్పందానికి కాలం చెల్లినందున, మళ్లీ ఒప్పందం చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ హయత్ గ్రూప్తో కలిసి హోటల్ ఏర్పాటు చేయబోతోంది.











