ఏపీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మైసూరు ఉన్న ఆయనను పక్కా సమచారంతో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్నారు.
లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా గోవిందప్పతో పాటు CMO మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురిని విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ ముగ్గురూ నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.
జగన్కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు. లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయ రెడ్డి పాత్ర ఉంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యారని సిట్ ఇప్పటికే తేల్చింది. లిక్కర్ స్కామ్ సొమ్మును రాజ్ కసిరెడ్డి వీరికి సరఫరా చేస్తే..వీరు దాన్ని బిగ్బాస్ జగన్కు అందజేసే వారని ఇప్పటివరకూ అరెస్టయిన నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేసింది.











