ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం.. వాటితో సంబంధం ఉన్న అధికారులపై కేసులు నమోదు కావడంతోపాటు.. జైలుకెళ్లడం జరుగుతోంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. మరో కేసులు సీనియర్ ఐఏఎస్ అధికారి, వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ప్రకాష్కి జైలు విధించారు. ఇక భారీగా జరిగిన అక్రమాల్లో ఇసుక, మద్యం మాఫియాలున్నాయి. వాటిలో ఇసుక మాఫియా మూలంగా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం వేల కోట్లలో ఆగిపోయింది. అదికాస్త అప్పటి వైసీపీ అధినేతతోపాటు.. ఇతర వైసీపీ నేతల జేబుల్లోకి చేరింది. దీనిపై విచారణ జరిపించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బాధ్యులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది.
ఇందులో ప్రధాన బాధ్యుడిగా ఉన్న అప్పటి గనుల శాఖ డైరక్టర్ వీజీ వెంకట్రెడ్డి ఏసీబీ విచారణలో పలు అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే తాను నడుచుకున్నానని.. అన్నీ వారే చేయించారని.. తాను కేవలం నిమిత్తమాత్రుణ్నేనంటూ ఏసీబీ విచారణలో గనులశాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వెల్లడించినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసులో నాటి గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు… గురువారం ఉదయం ఆయన్ను కస్టడీకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వగా.. తొలిరోజైన గురువారం ఏసీబీ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు. కొన్నింటికి మౌనం వహించగా, మరికొన్నింటికి పొడిపొడి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ‘‘ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరెవరు? మీకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి?’’ అనే ప్రశ్నలను ఆయన దాటవేశారు.
నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించే శక్తి తనకు లేదని.. అందుకే వారు చెప్పినట్లు అన్నీ చేశానని వెంకట్రెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. అఖిలభారత సర్వీసుల అధికారిగా.. నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మీకు తెలీదా? ఎవరేం చెప్పినా చేసేస్తారా? అంటూ దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా.. అంతకుమించి తనకు ప్రత్యామ్నాయం లేదని చెప్పినట్లు సమాచారం. ఇసుక తవ్వకాలు, విక్రయం, సరఫరా బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు సిద్ధం చేశారు? నాటి ప్రభుత్వపెద్దల అస్మదీయ కంపెనీకే ఈ కాంట్రాక్టు దక్కేలా నిబంధనల్ని ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారు? అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా వాటికి అరకొరగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.
విచారణ సందర్బంగా ఏసీబీ అధికారులు.. టెండరు నిబంధనలకు విరుద్ధంగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) సంస్థ టర్న్కీ ఎంటర్ప్రైజెస్కు ఇసుక తవ్వకాలు, విక్రయాలు, సరఫరా కాంట్రాక్టును సబ్లీజుకు ఇస్తే మీరెలా అంగీకరించారు? జేపీవీఎల్ కాకుండా టర్న్కీ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను ఎలా అనుమతించారు? మీరు సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎవరైనా ఒత్తిడి చేశారా? జేపీవీఎల్ ప్రభుత్వానికి రూ.వందల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా వసూలు చేయకుండా రూ.120 కోట్ల బ్యాంక్ గ్యారంటీలను ఎలా వెనక్కి ఇచ్చేశారు? అలా ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారు? అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా.. అందుకు బదులిచ్చిన వెంకట్రెడ్డి.. మీకన్నీ తెలుసునని.. నేనేం చెప్పగలనో అవి చెప్పానని.. ఇంతకుమించి ఏమీ అడగొద్దని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ వే బిల్లులు కాకుండా చేతిరాతతో బిల్లులు ఇస్తుంటే ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నిస్తే… ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలున్నాయని వెంకటరెడ్డి చెప్పినట్లు తెలిసింది.
2023 మే నెలతో .. జేపీవీఎల్ ఇసుక తవ్వకాల కాంట్రాక్టు గడువు ముగిసిపోయినా .. 2023 నవంబరు వరకూ ఆ సంస్థే అనధికారికంగా తవ్వకాలు కొనసాగించేందుకు ఎందుకు అవకాశం కల్పించారు? అలా చేయాలని మీకు ఎవరు చెప్పారు? ఆ సంస్థ ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? పర్యావరణ అనుమతులు (ఈసీ)లు లేకుండానే ఇష్టానుసారం తవ్వకాలు చేపడుతుంటే ఎందుకు నిలువరించలేదు? సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ కళ్లకు గంతలు కట్టేలా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ మీ అంతట మీరే తీసుకున్న నిర్ణయాలా? ఎవరైనా ఆదేశించారా? వారి పేర్లు చెప్పండని ఏసీబీ అధికారులు అడగ్గా… అందుకు వెంకట్రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికే మీరు విచారణలో అన్నీ గుర్తించి ఉంటారు.. ఎవరి ఆదేశాల మేరకు నేను ఈ నిర్ణయాలు తీసుకున్నానో మీకు తెలిసే ఉంటుందని ఇన్డైరక్ట్గా సమాధానం చెప్పినట్లు తెలిసింది.
ఏసీబీ అధికారుల విచారణ సందర్బంగా .. పలు డాక్యుమెంట్లు చూపించి.. వాటిపై ప్రశ్నించినప్పుడు కొన్నింటికి నేరుగా సమాధానమిచ్చినప్పటికీ…. మరికొన్నింటికి స్పందించనట్టు తెలుస్తోంది. నేడు రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణ కొనసాగనుంది.