ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్సీఎల్ కంపెనీ ఏపీలో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్యకలాపాలు మొదలుపెట్టిన హెచ్సీఎల్ ప్రస్తుతం 4,500 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇకపై రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు హెచ్సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివ శంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ వెల్లడించారు. వీరు మంగళవారం ఉండవల్లి నివాసంలో ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు.
ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫేజ్ 2 లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. గత టీడీపీ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగా, తాను స్వయంగా వెళ్లి హెచ్సీఎల్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతి ఇచ్చిందని అన్నారు.
అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్ధత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదని.. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయిందని లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయండి, అందుకు అవసరమైన పూర్తి సహకారం మేము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐటీలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.