గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. రాజకీయ నాయకుడు, మంత్రి అనే హోదాలకే మచ్చ తెచ్చిన వ్యక్తి కొడాలి నాని అని ప్రజలంతా అభిప్రాయపడుతుంటారు. పాన్ పరాక్లు నములుకుంటూ, రౌడీ తరహాలో ప్రత్యర్థులను బూతులు తిడుతుంటారని కొడాలి నానికి చెడ్డ పేరు ఉంది. అలాంటి నానిని వచ్చే ఎన్నికల్లో ఓడించి నోరెత్తడానికి వీల్లేకుండా చేయాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు టీడీపీ నిర్వహిస్తున్న రా.. కదలి రా.. బహిరంగ సభ గుడివాడ చేరింది. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించగా.. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకేచోట ఇరు వర్గాల వారు సభలు, కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకోవడం దుమారానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
గుడివాడ చంద్రబాబు సభ ఉండడంతో ఎమ్మెల్యే కొడాలి నాని దానికి పోటీగా తన ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు కన్నా తానే ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకుంటూ గుడివాడలో ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్కు నివాళి అర్పిస్తున్నట్లుగా చేయడం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా కొడాలి నాని చేయలేదు. చంద్రబాబు సభ ఉండడంతో ఎన్టీఆర్పై ఎక్కడ లేని అభిమానం కురిపించి ఇలా అర్భాటం ప్రదర్శించారు. ఈ క్రమంలో నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ పరిణామాలు ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లారు. అంతకుముందు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకు వెళ్లారు. ఈ ఊరు గుడివాడ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంవల్ల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు అక్కడే ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. ఎన్నికల శంఖారావం పూరించిన అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న తొలి సభ కావడం.. అందులోనూ కొడాలి నాని నియోజకవర్గంలో ఈ సభ జరుగుతుండడంతో దీన్ని తెలుగు తమ్ముళ్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సభను టీడీపీ తమ బలప్రదర్శనగా భావిస్తుంది. తద్వారా కొడాలి నానికి మనోధైర్యం దెబ్బతీయాలనేది ఆలోచనగా తెలుస్తోంది. స్థానిక ముదినేపల్లి మార్గంలో బహిరంగ సభా వేదికను సిద్ధం చేశారు. ఈ గుడివాడ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా బలం చాటుకోవాలని టీడీపీ చూస్తోంది.