వైసీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల తరహా పాలిటిక్స్ చేయాలని చూస్తే..తోకలు కత్తిరిస్తానంటూ హెచ్చరికలు పంపారు. 2019 ఎన్నికల సమయంలో అనేక డ్రామాలు ఆడారని అన్నారు. బాబాయి గొడ్డలి పోటును గుండె పోటుగా చెప్పారని..పైగా దాన్ని తనకు అంటించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అయితే..అప్పట్లో వైసీపీ పన్నాగాలను గ్రహించలేక పోయానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అప్పట్లోనే వారిని జైలుకు పంపించి ఉంటే..2019 ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించి ఉండేదన్నారు.
విశాఖపట్నంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పదవులు రాని వారు అలుగుతున్నారని..కానీ, అలా అలగడం వల్ల సాధించేది ఏమీ లేదన్నారు. జెండా మోసేవారికి..మోసిన జెండా వదిలి పెట్టకుండా ఉన్నవారకి పార్టీలో ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు చంద్రబాబు. దేశంలో ఏ పార్టీకీ లేనంత సభ్యత్వం టీడీపీకి మాత్రమే ఉందన్నారు. దాదాపుకోటి మందికి పైగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని..ఇదొక హిస్టరీ అని పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తలతో తనది రాజకీయ బంధం కాదని..కుటుంబ సంబంధమన్నారు చంద్రబాబు. అందుకేపార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబాలు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో వారికి..బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంలో పింఛన్లు పెంచామని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి..ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. వారందరికీ ఇస్తున్నామని.. ఈ విషయాలను కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు.
రాష్ట్రమంతా ఒక ఎత్తు..విశాఖ ఒక ఎత్తన్నారు చంద్రబాబు. మంచివాళ్లు ఎక్కువగా ఉన్న నగరమిదన్నారు చంద్రబాబు. గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ..ప్రచారం చేసినా విశాఖ ప్రజలు నమ్మలేదన్నారు. అందుకే ఆ పార్టీకి విశాఖలో ఒక్కసీటు కూడా దక్కలేదన్నారు. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమవుతోందన్నారు. త్వరలోనే విశాఖకు మెట్రో, గూగుల్ డేటా హబ్ వస్తాయన్నారు. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ప్లాంట్ వస్తోందన్నారు. స్టీల్ప్లాంట్ను కాపాడింది ఎన్డీయే ప్రభుత్వమేనన్నారు చంద్రబాబు. ఇటీవల ఆర్థిక ప్యాకేజీ కూడా వచ్చిందన్నారు. అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రైల్వే జోన్కు భూమి కేటాయించామని గుర్తు చేశారు