ఏపీలో విద్యావ్యవస్థపై కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక మధ్యాహ్న భోజనంలో పోషక విలువలున్న పోర్టిఫైడ్ సన్నబియ్యం వాడాలని నిర్ణయించింది. ఇక తాజాగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కోనసీమ జిల్లా అధికారులు ప్రవేశపెట్టిన గోల్డెన్ అవర్ బీమా స్కీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉంది. కోనసీమ జిల్లాలోని సుమారు 8వేల మందికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వేదాంత సంస్థ రూ.200 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. దీంతో 10 పడకలు కలిగిన చిన్నచిన్న ఆసుపత్రుల్లో సైతం విద్యార్థులు ఏడాదికి రూ.50వేల విలువైన చికిత్సను ఉచితంగా చేయించుకునే అవకాశం లభించింది. వాస్తవానికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద 50 పడకల ఆసుపత్రుల్లోనే ప్రస్తుతానికి ఉచిత వైద్యం అందుబాటులో ఉంది. అదే సమయంలో చికిత్సకయ్యే ఖర్చు రూ.1,000 కంటే ఎక్కువగా ఉండాలి. గోల్డెన్ అవర్ బీమా పథకంలో ఈ నిబంధన లేదు.
కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. NTR వైద్య సేవ ట్రస్టు ఆసుపత్రులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీటికి దూరంగా సాంఘిక, బీసీ సంక్షేమ వసతి గృహాలు, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. విద్యార్థులు అత్యవసర వైద్యం పొందాలంటే దూర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్కు రావడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల అందుబాటులో ఉన్న ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స పొందేందుకు సొంత డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకటి, రెండు రోజులు ఇన్పేషెంట్లుగా చికిత్స పొందేందుకు ‘గోల్డెన్ అవర్ బీమా’ పథకం వీలు కల్పిస్తుంది.
దీంతో ఈ జిల్లా నుంచి వచ్చిన నివేదికపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు కింద చికిత్సకయ్యే ఖర్చు రూ.1,000 దాటితేనే అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది. అయితే..50 పడకలతోపాటు పలు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే..ప్రైవేట్ ఆసుపత్రులకు ట్రస్టు అనుబంధ గుర్తింపు మంజూరు చేస్తోంది. దీనివల్ల గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని ట్రస్టు కింద చేర్చి, అమలుచేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు.











